టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చిన లక్ష్మణ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ టిఆర్ఎస్ పార్టీ పై బాంబు పేల్చారు. టిఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నారని, పెద్ద ఎత్తున బిజెపిలో చేరికలు ఉండబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బీజేపీ అని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్న లక్ష్మణ్ హన్మకొండలోని నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై విరుచుకుపడిన లక్ష్మణ్ ... బీజేపీని ఆపటం మీ తరం కాదని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందన్న లక్ష్మణ్ ఆగస్టు 20వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్ ను అందరూ కొనియాడుతున్నారు అని జమ్మూ కాశ్మీర్ విభజన పట్ల తీసుకున్న నిర్ణయం అందరి మన్ననలు పొందుతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు చీదరించుకుంటున్నారని పేర్కొన్న లక్ష్మణ్ అటు టిఆర్ఎస్ పైన కాంగ్రెస్ పైన విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ బిజెపి నిలువరించడానికి ప్రయత్నం చేస్తున్నాయని కానీ అది సాధ్యం కాదని లక్ష్మణ్ పేర్కొన్నారు.
కూట్లో రాయి తీయ లేనోడు ఏట్లో రాయి తీస్తాడా అని కేసీఆర్ పై లక్ష్మణ్ సెటైర్లు
కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ తోక పార్టీ అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం పై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయిందని, కానీ బిజెపి ఉద్యమ ఫలితంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంపై రాష్ట్రపతి స్పందించారని లక్ష్మణ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసింది అన్న లక్ష్మణ్ సర్పంచులకు రాష్ట్రం నుంచి నిధులు లేవని, కేంద్ర నిధులను సద్వినియోగం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఇక సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి అని పేర్కొన్నారు. కూట్లో రాయి తీయ లేనోడు ఏట్లో రాయి తీస్తాడా అన్న చందంగా కేసీఆర్ మాటలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరం ఉంటే రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్ పై ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరం ఉంటే రాయలసీమను రతనాల సీమ చేస్తానని కెసిఆర్ ఆంధ్రప్రదేశ్లో చెప్పారని విమర్శలు గుప్పించారు. ఇక పరమత సహనం గురించి కేటీఆర్ కెసిఆర్ లు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కెసిఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ ప్రభుత్వ అవినీతి పై బిజెపి పోరాటం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి కల్వకుంట పాల నుండి బిజెపి విముక్తి కల్పిస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 18న నడ్డా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ చేరికలు ఉంటాయన్న లక్ష్మణ్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇక సెప్టెంబర్ 15న అమిత్షా హైదరాబాదులో పర్యటిస్తారని, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే బాధ్యత అమిత్ షా తీసుకుంటారని లక్ష్మణ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ తరహా హింస రాజకీయాలు తెలంగాణలో చెల్లవని లక్ష్మణ్ చెప్పారు.