Liquor Sales in Hyderabad: మందుబాబుల దండయాత్ర...దసరాను మించిన దమాకా...లిక్కర్ సేల్స్ ఎంతంటే..!
దాదాపు 46 రోజులు.. చుక్క లేదు కిక్కు లేదు.. చాలామంది మందుబాబులు తమనేదో డీఎడిక్షన్ సెంటర్లో పడేసినట్టుగా ఫీల్ అయ్యారు. కానీ మద్యం షాపులకు అనుమతిస్తూ ప్రభుత్వం ప్రకటన చేయగానే నెలన్నర రోజుల నిరుత్సాహమంతా కొట్టుకుపోయింది. కొత్త ఉత్సాహంతో మద్యం షాపుల వైపు పరుగులు తీశారు. కొంతమంది ఆ పూటకు చాలనుకునే సరుకుతో సరిపెట్టుకుంటే.. మరికొంతమంది వారానికి సరిపడా స్టాక్ పట్టుకెళ్లారు. మొత్తం మీద మందుబాబుల ప్రతాపానికి చాలా వైన్ షాపుల్లో పాత స్టాక్ అంతా ఒకే దెబ్బకు ఖాళీ అయిపోయింది. కేవలం ఒక్కరోజులోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.90కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా రూ.90కోట్లు.. హైదరాబాద్లో రూ.50కోట్లు..
తెలంగాణలో మందు బాబులు తమ ప్రతాపం చూపించారు. దీంతో కర్ణాటక,ఆంధ్రప్రదేశ్లను మించి రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2200 పైచిలుకు మద్యం షాపుల్లో బుధవారం(మే 6) ఒక్కరోజే రూ.90కోట్లు అమ్మకాలు జరిగాయి. అయితే ఫైనల్ నంబర్ ఎంత అన్న దానిపై ఇంకా కచ్చితమైన రిపోర్ట్ రావాల్సి ఉంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు రూ.50కోట్లు మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో నగరంలో సుమారు రూ.20 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. దసరా, సంక్రాంతి లాంటి ఫెస్టివల్స్ టైమ్లో ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పండుగలను సైతం మించేలా ఒక్కరోజులోనే ఇంత భారీ స్థాయిలో అమ్మకాలు జరగడం గమనార్హం.
అవసరానికి మించి కొనుగోళ్లు..
చాలామంది మందుబాబులు అవసరానికి మించి ఎక్కువ మద్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ముంబైలో మద్యం అమ్మకాలకు మొదట అనుమతినిచ్చి తర్వాత మూసేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ప్రభుత్వం మందు షాపులపై నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో కొంతమంది భారీగా మద్యాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం. 21 ఏళ్ల యువకుల దగ్గరి నుంచి వృద్దుల వరకు వైన్ షాపుల ముందు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. కొన్నిచోట్ల భౌతిక దూరాన్ని పాటించగా.. మరికొన్ని చోట్ల మందుబాబులు ఎగబడ్డారు.
ఇదే అదనుగా వైన్ షాప్స్ దోపిడీ
ప్రీమియం బ్రాండ్లపై 16శాతం,సాధారణ బ్రాండ్లపై 11శాతం పెంపును ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ కొంతమంది వైన్ షాపుల యజమానులు మాత్రం ఇదే అదనుగా దోచేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. మందుబాబులు సైతం రేట్ల కంటే మందు దొరికిందా లేదా అన్నదే ముఖ్యమన్నట్టుగా భావిస్తున్నారు. దీంతో వైన్ షాపుల దోపిడీ యథేచ్చగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వైన్ షాపుల వద్ద సవరించిన మద్యం ధరలను కూడా బోర్డుల ద్వారా ప్రదర్శించకపోవడం గమనార్హం,
Recommended Video
కొన్ని షాపుల్లో స్టాక్ ఖాళీ..
మందుబాబుల దండయాత్రతో చాలా షాపుల్లో స్టాక్ ఖాళీ అయిపోయింది. కొన్నిచోట్ల మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో కొంతమంది బడా బాబులు తమ పనిమనుషులను కార్లలో తీసుకొచ్చి.. వారి ద్వారా మద్యం కొనుగోలు చేయించారు. కొన్నిచోట్ల మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు నిరాశతో వెనుదిరిగారు.వెంటనే డిపోల నుంచి స్టాకు తెప్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని వైన్ షాపులకు లిక్కర్ సప్లై చేసే డిపోల్లో నెలరోజులకు సరిపడా మద్యం స్టాకు నిల్వ ఉందని ఆబ్కారీ అధికారులు తెలిపారు.