లక్షల్లో గుడ్ విల్ ఇచ్చి మద్యం షాపుల కైవసానికి సిద్ధం, రంగంలోకి కల్తీ మాఫియా
కరీంనగర్: మద్యం దుకాణాలు లక్కీడ్రా ద్వారా ఇతరులకు దక్కినా వాటిని చేజిక్కించుకునేందుకు లిక్కర్కింగ్లు మళ్లీ రంగంలోకి దిగారు. కల్తీ మద్యం విక్రయాల్లో ఆరితేరిన ఈ వ్యాపారులు గుడ్విల్ ఇచ్చి ఎలాగైనా దుకాణాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలను ముమ్మరం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒక్కో దుకాణానికి రూ. 75 లక్షల వరకు గుడ్విల్ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఈ వ్యాపారంలో అంతగా ఏముందనే గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి. కల్తీమద్యంలో ఆరితేరిన వ్యాపారులే దుకాణాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుండడంతో ఇది ఎటొచ్చి మందు బాబుల ఆరోగ్యం మీద ప్రభావం పడనుందనే ప్రచారం మొదలైంది.
జిల్లాలో 28 మద్యం దుకాణాలున్నాయి. అమ్మకాలు పెరిగిన దృష్ట్యా కొత్తగా జిల్లాకేంద్రంలో ఒక దుకాణం పెరిగింది. ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులే ఇక్కడ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈ సారి దుకాణాలు లక్కీడ్రాలో ఇతరులకు దక్కినా లాభాలు రుచిమెరిగి ఉండడంతో పాత వ్యాపారులు మళ్లీ తమ ప్రయత్నాలకు పదునుపెట్టారు. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల్లో ఉండే గొలుసు దుకాణాలకు మద్యం దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తారు. అయితే ప్రభుత్వం అందించే మద్యం విక్రయిస్తే ఎక్కువగా లాభం ఉండకపోవడంతో ఈ గొలుసు దుకాణాలు కల్తీ మద్యం విక్రయాలకు కేంద్రంగా మారాయి.
అయితే ఈ కల్తీ మద్యాన్ని కొందరు మద్యం వ్యాపారులే సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. జిల్లాలోని కొందరు మద్యం వ్యాపారులకు మహారాష్ట్రలోని నాందేడ్లోని కల్తీమద్యం తయారుచేసే వ్యాపారులతో సంబంధాలు ఉండడంతోనే జిల్లాలో కల్తీమద్యం ఏరులైపారుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
మరికొన్నిచోట్ల మండలాల్లోనే మద్యం వ్యాపారులు తమ పలుకుబడి ఎక్కువగా ఉండే గ్రామాలను కల్తీచేసేందుకు ఎంచుకుంటున్నారు. మద్యంలో రంగునీళ్లు కలిపి అన్ని గొలుసు దుకాణాలకు పంపిణీ చేస్తున్నారు. గతంలో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం వెళ్తుండగా తలమడుగు మండలం లక్ష్మీపూర్ అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద, తలమడుగు మండల కేంద్రంలో మద్యం పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి.
దీనికితోడు జిల్లాకేంద్రంలోని పలు గొలుసు దుకాణాలతోపాటు మరికొన్ని గ్రామాల్లో రంగునీళ్లు కలిపిన మద్యం పట్టుబడడం జిల్లాలో కల్తీకి మద్యానికి నిదర్శనం. మద్యం సీసాలు సీల్ విప్పి తిరిగి సీల్ వేసేందుకు యంత్రాలు కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నారంటే ఇక్కడ కల్తీలో ఎంత భారీగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏటా రూ.కోట్లలోనే అక్రమంగా సంపాదిస్తున్నారు. దీంతో ఈ వ్యాపారంలో పేరుగాంచిన వ్యక్తులు డబ్బుల రుచిమెరగడంతో మద్యం దుకాణాలు ఎవరికి వచ్చినా తమ ఆదీనంలోకి తీసుకునేందుకు బేరసారాలు మొదలెట్టారు. మళ్లీ కల్తీ మద్యం జిల్లాలో బుసలు కొట్టనుందని తెలుస్తోంది.