అక్షయ్ కుమార్ 'స్పెషల్ 26' సినిమా ఫక్కీలో అశ్వినీరావు
బెంగళూరు: ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే పద్ధతిని కర్ణాటక లోకాయుక్త జస్టిస్ భాస్కర్ రావు కుమారుడు అశ్వినీరావు అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్పెషల్ 26 సినిమా నుంచి నేర్చుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అంటున్నారు. అశ్వినీరావును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అశ్వినీరావుకు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. లోకాయుక్త అవినీతి కేసు బయటకు వచ్చే వరకు అశ్వినీరావు గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. హైదరాబాదులో ఉన్నప్పుడు తండ్రి పేరును వాడుకుని డీల్స్ కుదురుస్తూ వచ్చాడని అంటారు.
అశ్వినీరావు హైదరాబాదు వెలుపలనే తన కార్యకలాపాలను నిర్వహించాడని భావిస్తున్నారు. అతనిపై ఇంతకు ముందు చిన్నపాటి కేసులు కూడా ఉన్నాయి. స్పెషల్ 26 సినిమాలో మాదిరిగా అశ్వినీరావు, అతని అనుచరులు కార్యకలాపాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో సిబిఐ అధికారుల అవతారమెత్తి దాడులు, బలవంతపు వసూళ్లు చేస్తుంటారు. అదే తరహాలో అశ్వీనిరావు, అతని అనుచరులు కార్యకలాపాలు సాగించినట్లు భావిస్తున్నారు.
కృష్ణారావు అనే పేరు వాడిన అశ్వినీ రావు
తన కార్యకలాపాలకు అశ్వినీరావు కృష్ణారావు అనే పేరును వాడుకున్నట్లు సిట్ అధికారులు చెప్పారు. లోకాయుక్త జాయింట్ కమిషనర్ కృష్ణారావును అంటూ అశ్వినీ రావు ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అతని నేర విస్తృతి ఏ మేరకు ఉందనేది ఇంకా గుర్తించాల్సే ఉంది. తన తండ్రి పేరు వాడుకుని అశ్వినీరావు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
అశ్వినీ రావు హైదరాబాదులోనే ఎక్కువగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండేవాడని, తన తండ్రి భాస్కర రావు కర్ణాటక లోకాయుక్తగా నియమితులు కాగానే హైదరాబాదు నుంచి కర్ణాటకకు అతని రాకపోకలు పెరిగాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కృష్ణారావుగా చెబుకుంటూ నేరానికి పాల్పడ్డాడనే ఆరోపణపై అశ్వినీరావుపై ఇప్పటికే కేసు నమోదైంది. ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి అశ్వినీరావు కోటి రూపాయలు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి.