లారీ బీభత్సం: ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు, భద్రాద్రిలో విషాదం
Recommended Video
హైదరాబాద్: నగర శివారు వనస్థలిపురం సుష్మా సమీపంలో విజయవాడ రహదారిపై ఇసుక లారీ బుధవారం బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకెళ్లి దాని ముందర వెళ్తున్న ద్విచక్రవాహనంతో పాటు మూడు ఆటోలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుటుంబసభ్యుల్లో తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో మహిళ, బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు ఆటోల్లో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
టిప్పర్ బీభత్సతం: బాలుడు మృతి
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ ప్రధాన సెంటర్లో టిప్పర్ ఢీకొని ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. టిఫిన్ కోసమని తాతతో కలిసి వెళ్తున్న చెర్రీ అనే బాలుడిని కొత్తగూడెం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో చెర్రీ అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడి తాత గాంధీ తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో ఆగ్రహించిన స్థానికులు టిప్పర్ను ధ్వంసం చేశారు. ఈ ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.