ప్రేమికులు ఆత్మహత్య: మూడు నెలల తర్వాత ప్రేయసి శవం
హైదరాబాద్: తమ కూతురు ఎక్కడో బతికి ఉందనే తల్లిదండ్రుల ఆశలు వమ్మయ్యాయి. మూడు నెలల తర్వాత తమ కూతురి మృతదేహం బయటపడింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయంతో, తమ ప్రేమ గురించి తెలిస్తే ఇరు కుటుంబాల మధ్య తగాదాలు చోటు చేసుకుంటాయనే అనుమానంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రేయసీప్రియులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
విషం సేవించి కొనఊపిరితో సంఘటనా స్థలం నుంచి వచ్చిన ప్రియుడు మార్గమధ్యలో మరణించాడు. మూడు నెలల తర్వాత ప్రేయసి మృతదేహం బయటపడింది. ఈ సంఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
Also Read: షాక్: ఆరేళ్లుగా జాబ్కు డుమ్మా, ఎవరూ గుర్తించలేదు
పెద్ద అంబర్పేట నగర పంచాయతీ పరిధిలోని తట్టిఅన్నారంలో నివసించే బురుగు నారాయణ గౌడ్ స్థానికంగా మిర్చి బండి నడుపుతుంటాడు. ఆయన కూతురు మానస (18) టైలరింగ్ నేర్చుకునేది. అదే గ్రామంలో నివసింటే నర్సింహ కుమారుడు హరిబాబు (25) ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు ప్రేమించుకున్నారు.
మానస తల్లిదండ్రులకు విషయం తెలిసిందే. దీంతో మానసను వారు వరంగల్ జిల్లా గీసుకొండలోని ఆమె పెద్దమ్మ ఇంటికి పంపించారు. ప్రేయసిని మరిచిపోలేక హరిబాబు నిరుడు నవంబర్ 20వ తేదీన మానసను బైక్పై తీసుకుని వచ్చాడు.
మర్నాడు తెల్లవారు జామున తాము ఇద్దరం ఒకే దగ్గర ఉన్నామని, చనిపోతున్నామని అని హరిబాబు ఫోన్ నుంచి రెండు కుటుంబాలకు చెందినవారికి మెసేజ్ పంపించారు. దాంతో ఇరు కుటుంబాలకు చెందినవారు కూడా వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. నవంబర్ 21వ తేదీన అంబర్పేట సమీపంలోని పాపాయిగూడా చౌరస్తా వద్ద హరిబాబు అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను మరణించాడు.
మానస ఆచూకీ దొరకకపోవడంతో ఆమె బతికే ఉండవచ్చునని తల్లిదండ్రులు భావిస్తూ వచ్చారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో అదే నెల 25వ తేదీన గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని తట్టిఅన్నారంలో పుకార్లు వ్యాపించాయి.
దాంతో బుధవారంనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. గ్రామంలోని గద్దగుండి చెలుక వద్ద నిర్మానుష్యమైన ప్రదేశంలో బండరాయిపై ఓ మృతదేహం కనిపించింది. మృతదేహానికి ఉన్న కమ్మలు, పట్టగొలుసులు, దుస్తుల ఆధారంగా మానసగా గుర్తించారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కనిపించింది.
తాము ప్రేమించుకుంటున్నామని, తమకు ఇది వరకే పెళ్లయిందని, పెద్దలకు తెలిస్తే గొడవలు అవుతాయనే ఉద్దేశంతో చనిపోతున్నామని, ఎవరి బలవంతం కూడా లేదని అందులో రాశారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు.