చైనా నుంచి దిగుమతి: మూడ్ మార్చే ఎల్ఎస్డి విక్రయదార్ల ముఠా అరెస్టు
హైదరాబాద్: మూడ్ను మార్చే ‘న్యూక్లెస్ మార్కెట్ ప్లేస్'తో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని చైనా నుంచి భారత్కు ఎల్ఎస్డి (లాసెర్జిక్ యాసిడ్ డైమిథ్మెనైడ్) అనే మాదకద్రవ్యాన్ని దిగుమతి చేసుకుంటూ నాగ్పూర్ కేంద్రంగా అక్రమ వ్యాపారం సాగిస్తున్న మయాంక్ కుమార్ సాహు, పియూష్ సాహు అన్నదమ్ములను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
గత కొంత కాలం నుంచి నాగ్పూర్-హైదరాబాద్ కేంద్రంగా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ అక్రమవ్యాపారంపై టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేశారు. ఇటీవల నగరంలో ముగ్గురు యువకులు ఈ మాదకద్రవ్యాలను విక్రయిస్తుండగా పట్టుబడటంతో పోలీసు అధికారులకు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ సూత్రధారులు చిక్కారు. నగరంలోని కింగ్కోఠిలో వారిని అరెస్టు చేసి వారి నుంచి 45ఎల్ఎస్డి సాచెట్లను, ఎఫెడ్రైన్ను స్వాధీనం చేసుకున్నట్టు ఆదివారం సిసిఎస్ పోలీసులు తెలిపారు.
పోలీసు కస్టడిలో ఉన్న ముగ్గురు యువకుల అనుచరులకు లిబర్టీ వద్ద వంద ఎల్ఎస్డి పొట్లాలను అమ్ముతున్న సాహు సోదరులను అదుపులోకి తీసుకొని విచారించగా తాము ‘న్యూక్లెస్ మార్కెట్ ప్లేస్' డీప్ వెబ్తో టేల్స్ ఆపరేటింగ్ సిస్టం'తో ఆన్లైన్ ఆర్డర్లు ఇచ్చి ఈ మాదక ద్రవ్యాలను భారత్కు దిగుమతి చేసుకుంటున్నామని, నాగపూర్కు నేరుగా రప్పించి అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించి విక్రయిస్తున్నట్టు చెప్పారు.
ఒక ఎల్ఎస్డి సాచెట్ను రూ. 400లకు కొనుగోలు చేసి రూ. 1500లకు అమ్ముతామని చెప్పినట్టు సిసిఎస్ పోలీసులు తెలిపారు. డీప్ వెబ్ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా సాగిస్తున్న ఈ వ్యాపారంలో మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశామని సైబరాబాద్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్ తెలిపారు.
ఇప్పటి వరకు కర్నాటకలోని బెంగుళూరులో కొందరు ఈ వ్యాపారంలో అరెస్టు అయ్యారని, స్మగ్లర్లు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించే యత్నం చేస్తున్నట్టు విచారణలో తేలినట్టు నార్కొటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్సిబి) అధికారులు చెప్పారు.