స్కూల్లో ఫైట్, టెంత్ విద్యార్థి మృతి: సరదాకు కొట్టుకున్నామని విద్యార్థి, సిసి ఫుటేజ్ స్వాధీనం
హైదరాబాద్: సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థి సిద్ధిఖి మృతి కేసులో తోటి విద్యార్థిని నారాయణగూడ పోలీసులు గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం లంచ్ సమయంలో ఇద్దరు విద్యార్థులు పాఠశాలలో గొడవపడ్డారు.
ఈ గొడవ కారణంగా సిద్ధిఖి అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసులు సిద్ధిఖితో గొడవ పడిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం జువైనల్ హోంకు తరలించారు.
పోలీసులు అతని నుంచి వివరాలు తీసుకున్నారు. తమ ఇద్దరి మధ్య ఘర్షణ జరగలేదని, సరదాకు కొట్లాడుకున్నామని అతని చెప్పాడని తెలుస్తోంది. పోలీసులు పాఠశాలలోని సిసి టీవి ఫుటేజ్ దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, కింగ్ కోఠిలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో దారుణం జరిగింది. విద్యార్ధుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణలో పదో తరగతి విద్యార్థి సిద్ధిఖీ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బలమైన దెబ్బలు తగలడం వల్లే విద్యార్ధి సిద్దిఖీ మృతిచెందినట్లు సెంట్రల్జోన్ డీసీపీ కమలాసన్రెడ్డి వెల్లడించారు.