ముగిసిన మేడారం మహా జాతర.!ఐనా మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరిన భక్తులు.!
ములుగు/హైదరాబాద్ : మేడారం మహా జాతర ఇప్పటి వరకు కోటి 50 లక్షల మంది భక్తుల సందర్శనం జరిగిందని, జాతర తర్వాత కూడా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారని అదికారులు స్పష్టం చేస్తున్నారు. సంప్రదాయ బద్ధంగా పూజాదికాలు, వనదేవతల వన ప్రవేశం జరిగిందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేసారు. జాతర సందర్బంగా అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని మంత్రులు కితాబిచ్చారు.మహా జాతరలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతల తెలిపారు మంత్రులు.
ముగిసిన మహా జాతర.. తెలంగాణ కుంభమేళాగా మేడారం
తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరసగా నాల్గోసారి జరిగిన మేడారం మహా జాతర విజయవంతమైంది. ఇప్పటివరకు మొత్తం దాదాపు కోటి 50 లక్షల మంది వనదేవతలను సందర్శించారు. తమ ఇష్ట దైవాలను తనివితీరా కొలుచుకున్నారు. ఈ జాతర ఏర్పాట్లలో, నిర్వహణలో నిమగ్నమై విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది, పూజారులు, ఆదివాసీ సంఘాలు, భక్తులు సహా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. జాతరలో ఎన్నడూ లేని విధంగా 75 కోట్లు కేటాయించామని, దేవాదాయ శాఖ ద్వారా మరో 10 కోట్లు, మొత్తం 85 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రులు చెప్పారు.
మేడారంకు పోటెత్తిన భక్తులు.. కోటిన్నరకు పైగా మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ఈ సందర్భంగా మంత్రుల ద్వయం మాట్లాడుతూ, కరోనా కారణంగా జాతర ఉంటుందో లేదో అన్న అనుమానాలతో మూడు నెలల ముందు నుంచే జాతర జరిగే సమయానికి 60 లక్షల మంది మేడారం దర్శించుకున్నారు. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ రాత్రి ముగిసే నాటికి కోటి 50 లక్షలకు భక్తుల సంఖ్య చేరుతుంది అన్నారు. పార్కింగ్, సీసీ కెమెరాలు, చెక్కింగ్ పాయింట్ల వద్ద జరిగిన లెక్కింపు ఆధారంగా ఈ వివరాలు అందిస్తున్నామని మంత్రులు అన్నారు.
వనప్రవేశం చేసిన దేవతలు.. ఇంకా మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
జాతర ముగిసిన తరువాత కూడా లక్షల మంది వరకు భక్తులు ఎటుంవంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగివెళ్లెలా ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కోన్నారు. ప్రయాణ సదుపాయలు, రోడ్డు ఇతర మౌళిక వసతులు పెరగడం వలన భక్తులు వచ్చి వెళ్లడానికి సులువుగా ఉందని పేర్కోన్నారు. ఈ సారి భక్తులు ఎక్కువగా ఆగిపోలేదు, ఒక్క రాత్రి మాత్రమే ఉండి వెళ్లారని వారు తెలిపారు. అమ్మ వార్ల మహిమకు, భక్తుల నమ్మకానికి ప్రతీకగా కరోనా విజృంభించ లేదని, అంతా సజావుగా సాగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు.
శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు.. విజయవంతం చేసిన యంత్రాగానికి మంత్రుల కృతజ్ఞతలు
గత అనుభవాలతో పాటు ఈ సారి ఎదురైన అనుభవాలతో వచ్చే జాతరను మరింత పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామన్నారు. భూ సేకరణ చేపట్టి శాశ్వత నిర్మాణాలు చేపడితే, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉండవని మంత్రులు అన్నారు. ఈ సందర్బంగా జాతరలో ఏటువంటి ఇబ్బందుల లేకుండా గతంలో ఎన్నడు లేనివిధంగా చాలా సజావుగా జరగిందని, ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు