అవినీతికి కాదేదీ అనర్హం: కవిత, కేసీఆర్ ఫ్యామిలీపై విచారణ జరిపాలంటూ భట్టి, మధుయాష్కీ
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై విచారణ జరిపించాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యహారంలో కాంగ్రెస్ నేతలపై అనవసరపు ఆరోపణలు చేయొద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపైనా కేంద్రం విచారణ జరిపించాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నా బీజేపీ ఎందుకు విచారణ చేయట్లేదు అని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ అవినీతంటూ మధుయాష్కీ ఫైర్
చౌకబారు నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ పై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు. కల్వకుంట్ల కుటుంబం పరిపాలన దోపిడీ చేస్తోంది. దీంతో యావత్ తెలంగాణ సమాజం నష్టపోతోంది. తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ మేల్కోవాలి. కల్వకుంట్ల కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటంలో భాగస్వామ్యం కండి.
లిక్కర్ స్కామ్, ఇసుక దందాతో కల్వకుంట్ల కుటుంబం కొన్ని వేల కోట్లు కొల్లగొట్టింది. ఇవాళ ఆఖరికి మన బిడ్డల జీవితాలతో ఆడుకునే మద్యం విక్రయాల్లో ఆడబిడ్డ అయిన కవితమ్మకు పాత్ర ఉందంటే అత్యంత దారుణం. ఇది హేయమైన చర్య. సిగ్గుమాలిన చర్య. ఏ విధంగా డబ్బులు వచ్చినా తినడానికి సిద్ధంగా ఉన్నారు. శవాలపైన కూడా తినడానికి సిద్ధమైన చంద్రశేఖర్ రావు కుటుంబం. అవినీతికి పాల్పడితే నా కొడుకు అయినా నా బిడ్డ అయినా అరెస్ట్ చేస్తానని కేసీఆర్ గతంలో అన్నారని మధుయాష్కీ గుర్తు చేశారు.
కాపలా కుక్క అని.. ఇప్పుడు గుంటనక్కలా..: మధుయాష్కీ
కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన వ్యక్తి ఇవాళ గుంటనక్కలా మారి తెలంగాణను దోచుకుంటున్నాడని కేసీఆర్పై మండిపడ్డారు. దీనిపై తిరుగుబాటు చేయాల్సిందే. తెలంగాణ సమాజం కలిసి రావాలని కోరుకుంటున్నాం. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరున్నా, ఏ పార్టీ నేతలు ఉన్నా విచారణ జరపాల్సిందే, శిక్షించాల్సిందే. ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే విచారణ వేగవంతం చేసి చర్యలు తీసుకోవాలి' అని మధుయాష్కీ డిమాండ్ చేశారు. కవిత అవినీతికి ఏది కూడా అనర్హం కాదని ఎద్దేవా చేశారు.
ఫీనిక్స్ కూడా కేసీఆఆర్ కుటుంబానిదేనంటూ భట్టి విక్రమార్క
మరోవైపు, భట్టి విక్రమార్క కూడా కేసీఆర్ కుటుంబం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ మద్యం పాలసీలో కుంభకోణం జరిగితే.. అచ్చం అలాంటి విధానమే ఉన్న తెలంగాణలో ఇంకెంత అవినీతి జరిగిందో తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని అంటున్న బీజేపీ.. ఎందుకు ఆధారాలను సీబీఐకి ఇ్వవడం లేదని ప్రశ్నించింది. ఫీనిక్స్ కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన బినామీ సంస్థే అని విమర్శించారు. ఈడీ, సీబీఐలను దేశ సంపద లూటీ చేసేవారిపై ప్రయోగించాలని హితవు పలికారు. మద్యం అవినీతిపై ఆర్ధికశాఖ మంత్రి హరీశ్రావు స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.