మధులికకు ఇన్ఫెక్షన్ తో నరకం ... పరీక్షలకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
ప్రేమోన్మాది భరత్ దాడితో చిన్నారి మధులిక గజగజా వణికిపోయింది. ఉన్నత ఆశయంతో పోటీ ప్రపంచంలో చదువులో ముందడుగు వేస్తున్న మధులిక అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. 15 సార్లు అత్యంత పాశవికంగా కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన భరత్ చర్యతో కొద్దిరోజులుగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయంలో భగవంతుడా బ్రతికించు అని దీనంగా చూస్తోంది. పరీక్షలకు హాజరుకాలేని స్థితిలో మౌనంగా రోదిస్తోంది.

ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న మధులిక
అన్నెంపున్నెం తెలియని మైనర్ బాలిక మధులిక ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన మధులిక నిదానంగా కోలుకుంటోంది. మలక్ పేటలోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఆమె ఇంకా ఐసీయూలోనే ఉంది. ప్రస్తుతం ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ ఉందని ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సెప్టిసీమియా ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించిన వైద్యులు ఆమెను కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

చదువుల తల్లి పరీక్షలు రాసేనా
ప్రస్తుతం మధులిక ఉన్న పరిస్థితిని బట్టి ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు భావిస్తున్నారు.ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ మార్కులు సంపాదించాలని ఎన్నో కలలు కన్న ఆ చదువుల తల్లి ఇప్పుడు ఆస్పత్రిలో మంచానికే పరిమితం అయింది. ఒకపక్క ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో మధులిక పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు చదువుల టాపర్ ఐన మద్దతుగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఎంపీసీ లో 470 మార్కులకు గాను 441 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం లోను టాప్ మార్కులతో తన సత్తా చాటాలనుకుంది మధులిక.
కానీ మధులిక కు ఊహించని కష్టమొచ్చింది. ప్రేమోన్మాది ఘాతుకానికి బలై పరీక్షల సమయంలో అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. ప్రాణాల కోసం ఆసుపత్రిలో అల్లాడుతోంది.

మధులికకు పరీక్షలు రాసే ప్రత్యేక అనుమతికై విద్యార్ధి సంఘాల విజ్ఞప్తి
ఈ నెల 13 నుండి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 27 నుండి థియరీ పరీక్షలు జరగనున్నాయి. కానీ మధులిక అప్పటి వరకూ కోలుకునే అవకాశం లేదు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల మేరకు ఏ విద్యార్థి అయినా ఊహించని పరిస్థితిలో పరీక్షలకు హాజరు కాలేక పోతే ప్రత్యేక అనుమతి తో ఆ విద్యార్థికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మధులిక కు అటువంటి అవకాశం బావుంటుందని అందరు అభిప్రాయపడుతున్నారు.
మధులిక కు పూర్తిగా కోలుకున్న తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ను ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. మధులిక కు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించడం కోసం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ను కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతం మధులిక పరీక్షల సమయానికి కోలుకోలేదు కాబట్టి ఆమె కోలుకున్న తర్వాత పరీక్షలు నిర్వహించాలని వారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను విజ్ఞప్తి చేశారు.మధులిక పరీక్షలకు ప్రత్యేక అనుమతి ఇచ్చిన ఇంటర్మీడియట్ బోర్డు

కోలుకున్నాకే పరీక్షలు నిర్వహిస్తామన్న ఇంటర్ బోర్డు
ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సైతం మధులిక విషయంలో పాజిటివ్ గా స్పందించారు. ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఆమె కోలుకున్న తరువాత ఆమెకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని, ఆమె ఎప్పుడు రాస్తానంటే అప్పుడే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పెద్ద ఫైట్ చేస్తున్న మధులిక త్వరగా కోలుకుని పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని, ఈ చదువుల తల్లి తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుందాం.












Click it and Unblock the Notifications