వేయిస్తంభాల ఆలయంలో నేటినుండి మహాశివరాత్రి ఉత్సవాలు.. రేపే కళ్యాణమండప పునఃప్రారంభం!!
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. నేటి నుండి హన్మకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలను గురించి ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు ఉదయం ప్రత్యేక పూజలు చేసి ఐదు రోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించినట్టు వెల్లడించారు.
శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాలు, సాయంత్రం కల్యాణోత్సవం నిర్వహిస్తామని, రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాల సమయంలో 112 రుద్రాలతో లింగోద్భవ కాల పూజ నిర్వహిస్తామని తెలిపారు. రేపు విశేష పూజలతో పాటు జాగరణ ఉండే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని వెల్లడించారు.

ఇక మహాశివరాత్రి పర్వదినాన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కళ్యాణ మండపాన్ని పునః ప్రారంభిస్తామని వెల్లడించారు.శివరాత్రి రోజు కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని పునః ప్రారంభించనున్నట్టు ఆయన వివరించారు.
ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వేయి స్తంభాల దేవాలయ ఈవో వెంకటయ్య పేర్కొన్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్ళు వేయించినట్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విద్యుత్ దీపాలంకరణలతో వేయి స్తంభాల ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. ఉత్సవాల కోసం అన్ని శాఖల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
మరోవైపు చారిత్రక రామప్ప ఆలయంలోనూ మహా శివారాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మహా శివరాత్రి సందర్భంగా రామప్ప ఆలయంలో విశేష పూజలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వేడుకలు కొనసాగిస్తారు.












Click it and Unblock the Notifications