ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ మసీదులో దాక్కున్నారు: విదేశీయుల అరెస్ట్, క్రిమినల్ కేసులు
హైదరాబాద్: నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నవారికి కరోనా సోకడంతో దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే. లాక్డౌన్తో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో మర్కజ్ వెళ్లి వచ్చినవారితో పలువురికి కరోనా సోకింది. దీంతో మనదేశంలో ఒక్కసారిగా కేసులన్నీ రెట్టింపు అయ్యాయి. ఇప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతోంది.
టూరిస్టు వీసాలతో వచ్చి..
టూరిస్టు వీసాలతో మనదేశంలోకి వచ్చిన కొంత మంది విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మర్కజ్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉండటంతో వారిని కలిసిన వారికి కూడా వైరస్ సోకింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విదేశీయులు ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటుందనే భయంతో పలు ప్రాంతాల్లో రహస్యంగా తలదాచుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలోనూ..
తాజాగా హైదరాబాద్ నగరంలో తలదాచుకున్న పలువురు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కూడా వందలమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన కొంత మంది మలేషియాకు చెందిన వ్యక్తులు రహస్యంగా హైదరాబాద్ నగరంలోని మసీదులో తలదాచుకున్నారు.
ఐబీ సమాచారంతో విదేశీయుల అరెస్ట్..
ఇంటెలీజెన్స్ వర్గాలు అందించిన సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని.. రహస్యంగా దాక్కున్న ఆరుగురు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు.
వారిపై క్రిమనల్ కేసులు నమోదు చేశారు. నిందితుల్లో హమీద్ బిన్ జేహెచ్ గుజ్లీ, జహ్ రాతులామనీ, వరాహ్మద్ అల్ బక్రీ బిన్వాన్, ఏబీడీ మనాన్ జమాహ్ బిన్టీ అహ్మద్, ఖైరిలీ అన్వర్ బన్ అబ్దుల్ రహీం, జైనారియాల్ బిన్డీ ఎండీ నూర్ ఉన్నారు.
గాంధీ ఆస్పత్రికి తరలించి..
మలేషియాకు చెందిన వీరంతా పర్యాటక వీసాలపై భారతదేశానికి వచ్చి నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఫిలింనగర్ సమీపంలోని హకీంపేటలో ఓ మసీదులో తలదాచుకుంటున్నారు. ఐబీ సమాచారంతో ఆదివారం వీరందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వారి రిపోర్టులు వస్తేగానీ వారికి కరోనా ఉందా? లేదా? అనే విషయం వెల్లడవుతుంది.