'అమరావతి' పేరుతో కుట్ర: కవిత, తెరపైకి 'విభజన'.. రేవంత్కు రివర్స్
హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో కుట్ర జరుగుతోందని, దాని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని, తాము భవనం ఇస్తామని చెప్పినా, అమరావతిలో స్థలం లేదని చెబుతూ జాప్యం చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏపీ సీఎం చంద్రబాబుపై పరోక్షంగా మండిపడ్డారు.
హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ అంశం రెండు రోజులుగా ఆందోళనలు జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై కవిత మంగళవారం నాడు మాట్లాడారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ పైన కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. జంతర్ మంతర్లో కేసీఆర్ ధర్నాకు దిగే పరిస్థితి కల్పించవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు.
హైకోర్టు విభజన, ఆప్షన్ విధానం పైన విపక్షాలు ఇప్పుడు దీక్షలకు దిగాలని సవాల్ చేశారు. మాకు న్యాయం జరగకుంటే ఇంకా ఎక్కడకు వెళ్లాలన్నారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలన్నారు. అమరావతిలో భవనం లేదని చెప్పి హైకోర్టు విభజనను ఆపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీహార్, ఉత్తర ప్రదేశ్ విడిపోయినప్పుడు ఇలా జరగలేదని, ఏపీ విభజనలో మాత్రం హైకోర్టు విభజన వెనుక కుట్ర జరుగుతోందని, దీని వెనుక ఎవరున్నారో గుర్తించాలన్నారు. హైకోర్టు భవంతికి తాము భవనం ఇస్తామని చెబుతున్నామన్నారు. అయినా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు ఒత్తిడి మేరకే హైకోర్టు విభజన ఆగుతోందన్నారు. ప్రధాని మోడీని ఇప్పటి వరకు కేసీఆర్ పదిసార్లు అడిగి విభజన గురించి అడిగారన్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో ప్రతిరోజు మాట్లాడుతున్నారని చెప్పారు. భూసేకరణ పైన మేధావులు మౌనంగా ఉండటం సరికాదన్నారు. కోదండరాం వంటి వారు స్పందించాలన్నారు. జీవో 2013 మంచటిదా, జీవో 123 మంచిదా కోదండరామ్ చెప్పాలన్నారు.
మల్లన్న సాగర్ పైన మాట్లాడిన జానా రెడ్డి, బీజేపీ, టిడిపి నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ వద్దకు వెళ్లి ప్రజలను మభ్యపెట్టడం కాదని, హైకోర్టు విభజన కోసం ముందుకు రావాలని తెలంగాణ టిడిపి నేతలకు సవాల్ చేశారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపి, తెరాస.. ఇలా అందరం కలిసి కేంద్రాన్ని నిలదీద్దామని ఆమె అన్నారు.
ఉద్యోగుల విభజన మొదలు హైకోర్టు జడ్జిల అంశం వరకు తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీ కేడర్ జడ్జిలను తెలంగాణకు కేటాయిస్తున్నారని, రిటైర్మెంటుకు దగ్గరగా ఉన్న తెలంగాణ జడ్జిలను ఏపీకి కేటాయిస్తున్నారని ఆరోపించారు.
విపక్షాలకు రివర్స్!
కాగా, మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నం చేశాయి. అందులో అవి సఫలమయ్యాయని కూడా చెప్పవచ్చు. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకంగా రెండు రోజుల పాటు దీక్ష చేసారు. ఆయన దీక్షకు అనూహ్య స్పందన వచ్చింది.
తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు పరిహారం పెంచాలని విపక్షాలు చెబుతున్నాయి. దీనిపై సోమవారం నాడు హైకోర్టులో కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. రైతుల నుంచి తాము బలవంతంగా భూములు తీసుకోమని, అవసరమైతే భూసేకరణ చట్టం తీసుకు వస్తామని చెప్పారు.
మల్లన్న సాగర్ విషయంలో విపక్షాలు పైచేయి సాధించాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా హైకోర్టు విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తద్వారా విపక్షాల పైన మళ్లీ పైచేయి సాధించేందుకు ఇది తెరాసకు ఉపయోగపడుతోందని అంటున్నారు.