బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారు: భట్టి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వ్యాఖ్యానించారు. కెసిఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకుంటున్నారే తప్ప.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేయాలని భావించడం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పింఛను కార్డుల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలో నిల్చుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లబ్ధిదారుల జాబితా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల కోసం మళ్లీ దరఖాస్తులు కోరడం ఏంటని విక్రమార్క ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజలను హింసించడమేనని అన్నారు. కెసిఆర్ శాడిజంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం అనేది ఆమె వ్యక్తిగత విషయమని చెప్పారు. ఇప్పటికే ఆమె ఉత్తరప్రదేశ్లో కంపెయినర్గా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపు, ఓటములు సహజమేనని భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణ ఇంటర్ బోర్డుకు ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ప్రత్యేక ఇంటర్ బోర్డు ఏర్పాటుకు న్యాయశాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ఏర్పాటుపై ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 21ని విడుదల చేసింది. తాజా జీవో జారీతో వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పరీక్షలు రాయనున్నారు.