నా ప్రేమను అంగీకరించకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తా... యువతిని వేధిస్తున్న యువకుడి అరెస్ట్...
ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిని వేధిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మొదట స్నేహం పేరుతో యువతికి దగ్గరైన ఆ యువకుడు ఆ తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టాడు. ప్రేమించాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆమె సున్నితంగా తిరస్కరించగా.. ఎలాగైనా ఆమెను ఒప్పించాలనుకున్నాడు. ప్రేమించకపోతే చచ్చిపోతా లేదా నీ తల్లిదండ్రులను చంపుతానంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారు శంకర్పల్లి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ యువతిపై ప్రసాద్ రెడ్డి అనే యువకుడి కన్ను పడింది. గత మూడేళ్లుగా ఆమెను అతను ఫాలో అవుతున్నాడు. గతంలో ఓ విద్యార్థి ఆమెను ప్రేమ పేరుతో వేధించగా... ఆ విషయం తెలిసి అతనికి వార్నింగ్ ఇచ్చాడు. అలా ప్రసాద్ రెడ్డిపై ఆ యువతికి కొంత సాఫ్ట్ అభిప్రాయం ఏర్పడింది. అప్పుడప్పుడు అతనితో ఫోన్లో మాట్లాడేది. అయితే ఇదే అదనుగా ప్రసాద్ రెడ్డి ఆమెకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించడంతో తీవ్రంగా నొచ్చుకున్నాడు. రోజురోజుకు ప్రేమ పేరుతో అతని వేధింపులు ఎక్కువవడంతో ఆ యువతి అతన్ని దూరం పెట్టింది.దీంతో అతను సైకోలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.

తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని.. సూసైడ్ నోట్లో నీ పేరే రాస్తానని యువతికి మెసేజ్లు చేశాడు. కత్తితో చేతులు కట్ చేసుకున్నట్లు ఆమెకు కొన్ని ఫోటోలు పంపించాడు. నిజానికి ఆ ఫోటోలు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినవి.కానీ తానే ఆ పనిచేసినట్లు ఆమెను భ్రమపెట్టాడు.కొద్దిరోజులకు వేధింపులు మరింత తీవ్రమయ్యాయి.తనను ప్రేమించకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువవుతుండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
గత నెలలో ఇలాంటి ఘటనే ఢిల్లీలోనూ చోటు చేసుకుంది. తన ప్రేమను తిరస్కరించదనే కారణంతో ఇంటర్ చదువుతున్న యువతిని ఓ ప్రేమోన్మాది గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని నిందితుడు ప్రవీణ్ ఆరునెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రితో చెప్పింది. దీంతో తండ్రి ప్రవీణ్ను కొట్టి.. తీవ్రంగా మందలించాడు. ఇక అప్పటినుంచి ప్రవీణ్ మరింత రెచ్చిపోయాడు. ఎలాగైనా యువతి చంపాలనుకున్నాడు. ఓరోజు రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న యువతిపై ప్రవీణ్ గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.












Click it and Unblock the Notifications