కారులోనే సజీవ దహనం: హైదరాబాద్-కరీంనగర్ రహదారిపై మరో ఘోర ప్రమాదం..
గజ్వేల్: కరీంనగర్-హైదరాబాద్ రహదారిపై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగిపోయాయి. తాజాగా రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తుండగా రిమ్మనగూడ పెట్రోల్ బంక్ దాటగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. కారులో మంటలను గమనించిన స్థానికులు, తోటి వాహనదారులు లోపలున్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి అతన్ని బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆ ప్రయత్నం ఫలించలేదు.
క్షణాల్లో మంటలు కారు మొత్తం వ్యాపించడంతో అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గ్యాస్ సిలిండ్ లీకేజీ ప్రమాదానికి కారణమైందా? లేక పెట్రోల్ లీకేజీ కారణమా? అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురై కారు నంబర్ AP 11P 8686గా గుర్తించారు.
కాగా, కొద్దిరోజుల క్రితమే రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక రెండు రోజుల క్రితం మానకొండూర్ వద్ద జరిగిన ప్రమాదంలోనూ ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.