మహిళలకి అసభ్య వీడియో, అరెస్ట్: 'రజినీకాంత్'తో మాట్లాడిస్తానని..
హైదరాబాద్: అర్ధరాత్రి వేళల్లో మహిళలు, యువతులకు ఫోన్లు చేయడంతో పాటు అశ్లీల వీడియోలను పంపుతున్న వ్యక్తిని షి బృందం సభ్యులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో సరకు రవాణా, సామాగ్రిని ఇళ్లకు చేరేవేసే కంపెనీలో పని చేసే రంజిత్ ఈ వేధింపులకు పాల్పడుతున్నాడు.
అతను మహిళా వినియోగదారుల ఫోన్లకు అసభ్యకరమైన మేసేజ్లు, వీడియోలు పంపిస్తున్నాడు. దీంతో షీ టీమ్స్ నిర్భయ కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. రంజిత్ అలియాస్ చిన్నా నాయక్ వయస్సు 30. సరకు, సామగ్రిని ఇల్లకు చేరేవేసేటప్పుడు వినియోగదారుల ఫోన్ నంబర్లను తీసుకుని వారికి ఫోన్ చేసేవాడు.
మహిళలు, యువతులు మాట్లాడితే వెంటనే ఆ నంబర్లను గుర్తుంచుకుని వేళాపాళా లేకుండా ఫోన్లు చేయడం, వీడియోలు పంపించడం వంటివి చేస్తున్నాడు. భరించలేని ముగ్గురు యువతులు షి బృందానికి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు.
మెదక్ జిల్లా ఐడీఏ బొల్లారానికి చెందిన అడె రంజిత్ సదరు కంపెనీలో లేబర్గా పని చేస్తున్నాడు. మహిళా వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకొని వారికి ఫోన్లు చేస్తున్నాడు. వాట్సాప్లో వారికి అసభ్యకరమైన వీడియోలు, మేసేజ్లు పంపిస్తూ వేధిస్తున్నాడు. ఇతని నుంచి వేధింపులకు గురవుతున్న ముగ్గురు మహిళలు వేరు వేరుగా షీ టీమ్స్లో ఫిర్యాదు చేశారు.
రజినీతో మాట్లాడిస్తామన్న మోసగాళ్ల అరెస్టు
సూపర్ స్టార్ రజినీకాంత్తో మాట్లాడిస్తామంటూ ఇంటర్ విద్యార్థిని మోసం చేసి రూ.9.63లక్షలు స్వాహా చేసిన అనిల్ కుమార్ నల్లమోతు, రాజేంద్ర కుమార్ వర్మను సైబర్క్రైమ్ అధికారులు శనివారం అరెస్టు చేశారు.
ఇల్యుమినాటీ సొసైటీ సభ్యుడిగా చేర్పిస్తామంటూ మెహిదీపట్నంలో ఉంటున్న ఇంటర్ విద్యార్థితో రేమండ్స్ ఉడ్స్ అనే నైజీరియన్ అంతర్జాలం ద్వారా పరిచయమయ్యాడు. ఈ సొసైటీలో చేరితే రజినీకాంత్, సల్మాన్ఖాన్ సహా తెలుగు, తమిళ, హిందీ నటులను కలవడంతో పాటు విందు, వినోదాల్లో పాల్గొనవచ్చునని నమ్మించాడు.
ఈ విద్యార్థి మూడు నెలల్లో 9.63లక్షలను తన తల్లి పఠాన్ అమీనాబీ ద్వారా నైజీరియన్ చెప్పిన ఖాతాల్లో జమ చేశాడు. డబ్బువేసిన తర్వాత మాట్లాడకపోవడంతో మోసపోయామని గ్రహించిన అమీనాబీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి ఫోన్ నంబర్లు, ఖాతాలను పరిశీలించి ముంబైలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై వెళ్లి నైజీరియన్కు సహకరించిన బోరివిల్లి తూర్పు ప్రాంతంలో ఉంటున్న రాజేంద్ర కుమార్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో అనిల్ అనే వ్యక్తికీ సంబంధం ఉందని తెలుసుకున్నారు. 4సెల్ఫోన్లు, 12 చెక్బుక్కులు, స్వాధీనం చేసుకుని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.