భార్యను గొడ్డలితో నరికి చంపి వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూరులో ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో నరికి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలే ఈ సంఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
బండరాళ్లతో కొట్టి చంపారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ హత్య జరిగింది. చేవెళ్లలోని వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో కొట్టి దారుణంగా హతగావించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
మహిళ అనుమానస్పద మృతి
చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో గల శివాణి ఆసుపత్రిలో చేరిన దీప అనే ఓ మహిళ మృతిచెందింది. మహిళ మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని బందువులు అంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా వారు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
వైద్యులపై నైజీరియన్ల దాడి
హైదరాబాద్ నగరంలోని ఉస్మానియాలో వైద్యులపై ఇద్దరు నైజీరియన్లు దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై వైద్యులు అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి గల కారణాలు తెలియారాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉపసర్పంచ్పై దాడి
నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం బండ్లపల్లిలో ఉపసర్పంచ్ అంజయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అంజయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.