గొంతు కోసి భార్యను చంపిన భర్త... ఆపై ఆత్మహత్య... ప్రేమ పెళ్లి చేసుకున్న ఆర్నెళ్లకే...
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు... కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే భర్త వరకట్న వేధింపులు,అనుమానం కాపురంలో చిచ్చు పెట్టాయి. ఇద్దరి మధ్య గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఇదే క్రమంలో భర్త క్షణికావేశంలో భార్యను హత్య చేశాడు.ఆపై రైలు కిందపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రేమ వివాహం చేసుకున్న జంట పెళ్లయిన ఆర్నెళ్లకే ఇలా చనిపోవడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
అసలేం జరిగింది...
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్కు చెందిన సిరిపురం హరిశంకర్,మల్హర్ మండలానికి చెందిన రాగిణి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలానికి ఈ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పారు. హరిశంకర్ వైశ్య సామాజికవర్గం,రాగిణి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన అమ్మాయి కావడంతో పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. కానీ ఇరువురి పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించారు. అలా ఆర్నెళ్ల క్రితం ఇద్దరూ మూడుముళ్లతో ఒక్కటయ్యారు.
అనుమానం,వరకట్న వేధింపులు...
వివాహం తర్వాత హరిశంకర్-రాగిణి ఓ ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొంతకాలం ఇద్దరి అనుబంధం అన్యోన్యంగానే సాగింది. కానీ ఆ తర్వాత హరిశంకర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని తరుచూ భార్యను బాధపెట్టేవాడు. అంతేకాదు,రాగిణికి మరొకరితో సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు.
గొంతు కోసి హత్య చేశాడు....
వరకట్న వేధింపులు,అనుమానంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. అలా విషయం పెద్ద మనుషుల పంచాయితీ దాకా వెళ్లింది. పెద్దమనుషులు ఇద్దరికీ నచ్చజెప్పినప్పటికీ.. హరిశంకర్లో మార్పు రాలేదు. బుధవారం(జులై 7) ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన హరిశంకర్ క్షణికావేశంలో కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటిరోజు పక్కింటివారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రక్తపు మడుగులో రాగిణి విగతజీవిలా కనిపించింది.
Recommended Video
రైలు కింద పడి ఆత్మహత్య...
రాగిణిని హత్య చేసిన హరిశంకర్... ఆ తర్వాత కొద్ది గంటలకే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అటు రాగిణి హత్య,ఇటు హరిశంకర్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఆర్నెళ్లకే ఈ జంట ఇలా చనిపోవడం ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.