తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ వికెట్ అవుట్..!!
హైదరాబాద్: చాలాకాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుల లొల్లి నడుస్తోంది. పార్టీలో సుదీర్ఘకాలంగా ఉంటూ వస్తోన్న పాతకాపులకు పార్టీ పగ్గాలను అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కొద్దిరోజుల కిందటే దిగ్విజయ్ సింగ్ సైతం- హైదరాబాద్ కు వచ్చి.. సయోధ్య కుదర్చడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు గానీ సాధ్యపడలేదు.
స్పెషల్ ప్యాకేజ్- రాజధాని ప్రాంతాన్ని ఖాళీ చేయించనున్న ప్రభుత్వం..!?
అదే డిమాండ్..?
రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలనేది సీనియర్ల డిమాండ్. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. వీరంతా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్న వారే. దీనికి కారణాలు లేకపోలేదు. రేవంత్ రెడ్డి ఇదివరకు సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగడమే.
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా..
ఈ గందరగోళ పరిస్థితులను చక్కబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్. పార్టీ హైకమాండ్ దృష్టికీ ఇక్కడి పరిస్థితులను తీసుకెళ్లారు. దిగ్విజయ్ సింగ్ ను కూడా రాష్ట్రానికి రప్పించి- నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవేవీ కార్యరూపాన్ని దాల్చలేకపోయాయి. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గీయుల మధ్య సయోధ్యను కుదర్చలేకపోయాయి.
మాణిక్కం ఠాగూర్ రాజీనామా..
దీనితో మాణిక్కం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడి గొడవలను శాంతింపజేయడంలో విఫలం కావడానికి నైతిక బాధ్యతగా ఆయన ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గెకు పంపించారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులన్నింటినీ వివరిస్తూ ప్రత్యేకంగా మరో లేఖను కూడా మాణిక్కం ఠాకూర్ రాసినట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
మాణిక్కం ఠాగూర్ రాజీనామా వ్యవహారంతో- తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు పతాక స్థాయికి చేరినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తెలంగాణ. ఆగస్టు-అక్టోబర్ లల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా రాష్ట్ర ఇన్ ఛార్జే తన పదవి నుంచి తప్పుకోవడం కలకలం రేపుతోంది.