వగలమారి కరోనా, కయ్యాల కరోనా.. విరహాల కరోనా... కరోనా కమామిషులో దాగున్న ఎన్నో కథలు..!!
హైదరాబాద్/అమరావతి : కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు సభ్య దేశాలన్నీ ఒకే మంత్రాన్ని జపిస్తున్నాయి. అదే స్వీయ నియంత్రణ. అందుకోసం అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇక ఆఫీస్ పనులు ఇంటినుండే లాప్ టాప్ లో నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రం విచిత్ర అనుభవాలను చవిచూడాల్సివస్తున్నట్టు తెలుస్తోంది. వంట గదిలో కనీసం కాఫీ పౌడర్ ఏ డబ్బాలో ఉంటుందో తెలియని భర్తలు పాక శాస్త్రాన్ని అవపోసన పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కాలేజీ అమ్మాయిలకు, అబ్బాయిలకు నిత్యం స్మార్ట్ ఫోన్ తోడున్నా తెగ బోర్ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడంతో పిల్లల చేసే అల్లరితో టాప్ లేచిపోతున్నట్టు తెలుస్తోంది.
భర్తలకు వాట్సప్ మెస్సేజ్ లు.. చిర్రుబుర్రులాడుతున్న భార్యలు...
ఇక ఇంటి నుండే విధులు నిర్వహిస్తున్న ( వర్కింగ్ కపుల్ ) భార్యాభర్తల పరిస్థితి మరీ దారుణంగా తయారైనట్టు తెలుస్తోంది. మాట్లడుకోవడానికి క్షణం తీరిక దొరకని పరిస్థితుల నుండి కాలం ఎలా వెళ్లదీయాలా అనే పరిస్థితులకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా లాప్ టాప్ నుండి ఉపశమనం పొందేందుకు కొంత మంది భర్తలు వంటల మీద ప్రయోగం చేస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా కొంతమంది చిలిపి భర్తలకు వారి కొలీగ్స్ నుండి వచ్చే చిలిపి మెస్సేజీలు భార్య కంట పడకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆఫీస్ లో చనువుగా ఉండే స్నేహితురాళ్లు పెట్టే మెస్సేజీలు పొరపాటున భార్య చూస్తే చిన్నపాటి యుద్దానికి దారితీస్తాయని భర్తలు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రేమికులపై కన్నెర్ర చేస్తున్న కరోనా.. విరహవేదన అనుభవిస్తున్న లవర్ప్..
కాలేజీలకు పూర్తి స్థాయిలో సెలవులు ప్రకటించడంతో ప్రేమికులు విరహవేదన అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రేమించిన ప్రియురాలిని కలవాలనుకున్న కరోనా కన్నెర్ర చేస్తుంది. పోలీసులతో తాట తీయిస్తోంది. దీంతో వాట్సప్ మెస్సేజీలకే పరిమితమవుతున్నారు ప్రేమికులు. కాలేజీలు ఎప్పుడు తెరుస్తారా.? ప్రియసఖిని ఎప్పుడు కలుసుకోవాలా అని విరహ వేదనతో యువత విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ప్రేమికులను దూరం చేస్తున్న కరోనాపై కస్సుమంటున్నారు నగర ప్రేమికులు.
తారా స్థాయిలో పిల్లల అల్లరి.. స్కూళ్లకు సెలవులు కావడంతో కేరింతలు కొడుతున్న చిన్నారులు..
ఇక సెలబస్ మధ్యలో ఉండి సీరియస్ గా సాగుతున్న పాఠశాలలకు అకస్మాత్తుగా సెలవులు ప్రకటించడంతో బడి పిల్లల్లో తెలియని సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అప్రకటిత కర్య్పూ ఎప్పుడు ముగుస్తుందో తెలయక ఎగిరి గంతేస్తున్నారు. సెలవుల్లో కాలక్షేపం కోసం అపార్ట్ మెంట్ల కింద, టెర్రాస్ మీద, ఇంటి ముందు కేరింతలు అరుపులతో రకరకాల ఆటలను ఆడుకుంటున్నారు పిల్లలు. ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు కాబట్టి కొన్ని సందర్బాల్లో పిల్లల అల్లర్లతో తల్లి దండ్రులకు తలనొప్పులు వస్తున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
పోలీసులను రోడ్ల మీదకు తెచ్చిన కరోనా.. కరోనా కష్టాలు అనేక రూపాల్లో ..
అనేక మంది జీవితాల్లో కరోనా కల్లోలం రేపుతున్నట్టు తెలుస్తోంది. కొంతమందిని దగ్గరకు చేరిస్తే మరికొంత మంది మద్య ఇదే కరోనా చిచ్చుపెడుతున్నట్టు తెలుస్తోంది. యాంత్రిక జీవనంలో ఒక అరగంట కూడా కలిసి మాట్లడుకోలేని దంపతుల పట్ల కరోనా వరంగా మారితే, అదే దంపతుల మధ్య గిల్లి కజ్జాలను కూడా రేపుతోంది. అంతే కాకుండా రెక్కాడితే గాని డొక్కాడని రోజూవారి కూలీల జీవనాన్ని మాత్రం కరోనా ఛిన్నాభిన్నం చేసింది. చిన్నా చితకా చిరు వ్యాపారుల జీవనాన్ని కూడా కరోనా మృగ్యం చేసింది. స్నేహపూర్వక పోలీసు వ్యవస్ధ పేరుతో కాస్త రిలాక్స్ గా ఉన్న పోలీసులను మాత్రం కరోనా రోడ్డు మీదకు తీసుకొచ్చింది. కమీషనర్ నుండి కానిస్టేబుల్ వరకు 24గంటలు విధుల్లో ఉండేలా చేసింది ఈ మాయదారి కరోనా. మొత్తానికి అనుకోకుండా వచ్చిన ఈ మహమ్మారి అనేక రూపాల్లో తన విన్యాసాలను ప్రదర్శిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.