ఆ ఒక్క పని... TRSను కాపాడిందయ్యా..!?
తెలంగాణ రాష్ట్ర సమితి మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో 10వేలకు పైగా మెజారిటీతో విజయ ఢంకా మోగించింది. చివరి వరకు తమదే గెలుపంటూ చెబుతూ వచ్చిన భారతీయ జనతాపార్టీ ద్వితీయ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోలేక చతికిలపడింది. టీఆర్ఎస్ గెలవడానికి అనేక కారణాలు దోహపడినప్పటికీ ప్రధానంగా వారిని విజయతీరాలకు చేర్చింది మాత్రం కమ్యూనిస్టులని చెప్పవచ్చు.

చాకచక్యంగా వ్యవహరించిన కేసీఆర్
ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కమ్యూనిస్టులకు ఖిల్లా. ఉప ఎన్నిక అనివార్యమని స్పష్టమవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మద్దతును కూడగట్టారు. సీపీఎం, సీపీఐ మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటికీ తిరగడంతోపాటు ప్రచారం కూడా ఉధృతంగా చేశాయి. సీపీఐ, సీపీఎంలకు గట్టి పట్టున్న ప్రాంతాల్లో బీజేపీతో పోల్చితే కారు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

తోడైన వామపక్షాల బలం
స్థానికసంస్థల్లో వామపక్షాల తరఫున గెలుపొందిన ఎంపీటీసీ, సర్పంచి స్థానాల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గులాబీ దళంతో కాలు కదిపారు. 2018 ఎన్నికలతో పోలిస్తే 2564 ఓట్లు అధికంగా కారుకు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఉండగా, ఈసారి ఎన్నికల్లో గులాబీపార్టీతో కలిసి నడిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ పరిధిలో వామపక్షాలు 8 ఎంపీటీసీ, 6 సర్పంచ్ స్థానాలు గెలుపొందాయి. చండూరు, నారాయణపురం, మునుగోడు మండలాల్లో సీపీఐ ప్రజాప్రతినిధులు, చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీతోపాటు నారాయణపురం, మునుగోడులో సీపీఎం ప్రజాప్రతినిధులున్నారు. మర్రిగూడ, గట్టుప్పల, నాంపల్లిల్లోనూ వామపక్షాలకు ఓటుబ్యాంకు ఉంది.

వామపక్షాలున్నచోట కారుకు ఎక్కువ ఓట్లు
సీపీఐ, సీపీఎం ప్రతినిధులున్న 28 పోలింగ్ బూత్ ల్లో కూసుకుంట్లకు 2018 ఎన్నికల్లో 7554 ఓట్లు రాగా, కోమటిరెడ్డికి 10,045 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో కూసుకుంట్లకు 10,118 ఓట్లు రాగా కోమటిరెడ్డికి 9536 పోలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్షాలు అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి కలిసివస్తుందని భావించిన కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి పావులు కదిపారు. కమ్యూనిస్టు నేతలతో మాట్లాడగా బీజేపీని వ్యతిరేకించే శక్తులకు తాము అండగా నిలబడతామంటూ మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications