నయీం లింక్స్: టెక్ మధుకు ఆ పేరు ఎలా వచ్చింది?
హైదరాబాద్: నయీం కేసులో అరెస్టయిన టెక్ మధుకు ఆ పేరు ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అతని అసలు పేరు తోట కుమారస్వామి. అతనికి అశోక్ అనే పేరు కూడా ఉంది. మాజీ మావోయిస్టు. మావోయిస్టుల ఆయుధాలను తయారు చేసేవాడని అంటారు.
అతను 2006లో పోలీసులకు లొంగిపోయాడు. ఆయుధాలు తయారు చేయడంలోని నైపుణ్యం కారణంగానే అతని టెక్క మధు అనే పేరు వచ్చింది. మధు (43) మావోయిస్టుల కోసం 1,5550 రాకెట్లు, 40 లాంచర్లు తయారు చేసినట్లు చెబుతారు. లొంగిపోయిన మధుకు ప్రభుత్వం నుంచి పునరావాసం కోసం 4.8 లక్షల రూపాయలు కూడా ముట్టాయి.
దాంతో అతను హైదరాబాదులోని రాంనగర్లో సెల్ ఫోన్ స్టోర్ తెరిచాడు. నయీం హతమైన తర్వాత అతనితో మధుకు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదు నుంచి తన స్వగ్రామం కేసముద్రం వెళ్తుండగా పోలీసులు అతన్ని శుక్రవారంనాడు నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద అరెస్టు చేశారు.

అతని నుంచి ఓ నాటు తుపాకిని, నాలుగు లైవ్ రౌండ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నయీం కేసులో అతను 16వ నిందితుడు. టెక్ మధు శిశువులను అహహరించి నయీం డ్రైవర్ నెల్ల శ్రీధర్ గౌడ్కు అందించేవాడని, నయీం వారిని రక్షణ కవచంగా వాడుకునేవాడని అంటున్నారు.
శ్రీధర్ గౌడ్ నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందినవాడు. అతను ఇంజాపూర్లోని భవానీ ఎంక్లేవ్లో నివసిస్తున్నాడు. శ్రీధర్ గౌడ్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది క్రితం టెక్ మధు నయీంతో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు చెబుతున్నారు.
టెక్ మధు 1990లో అప్పటి పీపుల్స్వార్లే చేరి, దాని కేంద్ర కమిటీ సాంకేతిక విభాగం చీఫ్గా ఎదిగాడు. రాకెట్లను, లాంచర్లను తయారు చేయడానికి ఏడు ఫౌండ్రీల నుంచి ఆయుధాల తయారీ, సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేశాడనే అనుమానంతో తమిళనాడు క్యూ బ్రాంచ్ అతని కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టింది.
అతను 2002లో చెన్నైలోని అంబత్తూరు నుచి ఇంజనీరింగ్ డిప్లమా పొందాడు. ఆ తర్వాత తిరిగి నల్లమల అడవులకు చేరాడు. రాకెట్లను డిజైన్ చేయడానికి మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావుతో కలిసి పనిచేశాడని అంటారు.












Click it and Unblock the Notifications