కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ను హతమార్చిన మావోయిస్టులు.. పోలీస్ ఇన్ఫార్మర్ లకు ఇదేగతి అంటూ లేఖ
ములుగు జిల్లాలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు అత్యంత దారుణంగా హతమార్చారు. పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారన్న కారణంగా మాజీ సర్పంచ్ ను హతమార్చామని మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. చత్తీస్ గడ్ తెలంగాణ సరిహద్దులలో ఉన్న అటవీ ప్రాంతంలో రమేష్ ను హతమార్చినట్లుగా మావోయిస్టులు పేర్కొన్నారు. చాలా రోజుల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టులు తమ ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఇటీవల కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ ను హతమార్చినట్లుగా తెలుస్తుంది.

మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్రె బొంద గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కురసం రమేష్ ను మావోయిస్టులు సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు రమేష్ ఆచూకీ దొరకలేదు. మావోయిస్టులు కిడ్నాప్ చేసిన రమేష్, డబ్బులకు ఆశపడి పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని, మావోయిస్టులకు సానుభూతిపరుడిగా నటిస్తూ మావోయిస్టులను మోసం చేసే ప్రయత్నం చేశాడని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. అందుకే అతన్ని హతమార్చినట్లుగా వెల్లడించారు.

మావోలకు, పోలీసులకు పని చేస్తున్న ఇన్ఫార్మర్ అంటూ లేఖ
మావోయిస్టు సానుభూతిపరుడి గా నటించిన రమేష్ చేసిన దారుణాల గురించి మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. 2019లో పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారిన రమేష్ వెంకటాపురం ఎస్సై భూక్య తిరుపతికి ఇన్ ఫార్మర్ గా వ్యవహరించారని, పోలీసులు రమేష్ కు మూడు సార్లు 35 వేలు డబ్బులు ఇచ్చి మావోయిస్టులకు కొరియర్ గా పనిచేస్తూనే, తమకు ఇన్ఫార్మర్ గా వ్యవహరించాలని చెప్పినట్టు తమకు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులకు ఏ సామాన్లు అందించినా, వాటిని పోలీసుల వద్దకు తీసుకువెళ్లి వారు చెప్పిన విధంగా వారి ఆదేశాల మేరకు పని చేసేవాడని పేర్కొన్నారు.

రమేష్ పాలపొడిలో విషం కలిపాడు, ఎన్ కౌంటర్ కు కారణం అయ్యాడు
ఒకసారి రమేష్ కు పాలపొడి తీసుకురావాలని చెప్పడంతో ఈ విషయాన్ని రమేష్ ఎస్ఐ కు చెప్పాడని, ఎస్ఐ పాలపొడిలో విషం కలిపి పంపించారని, పాలపొడి తాగిన చాలామంది కామ్రేడ్లు అనారోగ్యం బారిన పడగా, మావోయిస్టు మ్యాదరి బిక్షపతి ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు. రమేష్ కారణంగా ఒక ఎన్కౌంటర్ కూడా జరిగిందని, ఆ తర్వాత రమేష్ కు రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలిసిందని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడని కాబట్టి ప్రజాభిప్రాయం మేరకు రమేష్ చంపుతున్నామని వెల్లడించారు.

పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తే రమేష్ కు పట్టిన గతే
పోలీసులు ఆదివాసీ ప్రజలను, కొందరు మాజీ ను ఒత్తిడి చేసి డబ్బు ఆశ చూపి డబుల్ ఏజెంట్ గా పని చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇన్ ఫార్మర్ లుగా మార్చుకుంటున్నారు అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీలు, పీడిత ప్రజలకు ఎవరైనా డబ్బు ఆశ చూపినా పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారవద్దని, మావోయిస్టు పార్టీకి ద్రోహం చేయొద్దని, ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే రమేష్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తున్నామంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు.

ఉద్యమానికి ద్రోహం చేస్తే వదిలిపెట్టేది లేదు
ఉద్యమానికి ద్రోహం చేసే వారిని వదిలిపెట్టేది లేదని మావోయిస్టులు ఈ సందర్భంగా వెల్లడించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం విప్లవోద్యమాన్ని నిర్వీర్యం చేసే పథకంలో భాగంగా పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చిందని, చాలా మందిని పోలీసులు ప్రలోభ పెడుతూ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు అంటూ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది. ఇక పోలీసులకు సమాచారం అందించే వారికి రమేష్ ను హతమార్చి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మావోయిస్టు పార్టీ.












Click it and Unblock the Notifications