మంత్రి చందూలాల్పై అన్నల గురి.. రంగంలోకి దిగిన 30 మంది మావోయిస్టులు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నాయకులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు అంతే స్థాయిలో రెక్కీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నేతలే టార్గెట్గా మావోయిస్టులు పనిచేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో పలు దాడులు చేసిన మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీలో కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోములను ఎలాగైతే హతమార్చారో అదే పద్ధతిని తెలంగాణలో కూడా అవలంబించబోతున్నట్లు సమాచారం.
తెలంగాణలోని ఓ మంత్రి, తాజా మాజీ స్పీకర్ను టార్గెట్ చేసినట్లు సమాచారం. అంతేకాదు తాడ్వాయి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. ఇక ప్రచారంలో బిజీగా ఉన్న మంత్రి చందూలాల్కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉండటంతో ఆయన్ను పోలీసులు అలర్ట్ చేశారు. దీంతో మంత్రి చందూలాల్ తాడ్వాయి మండలంలో ప్రచారంను మధ్యలోనే ఆపివేసి వెనుదిరిగారు. పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రెక్కీ సందర్భంగా మావోయిస్టులకు ఈ వ్యక్తులు తమ పొలంలో ఆశ్రయం కల్పించారని పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో ఎన్నికలకు ఒక్కరోజు ముందు మావోయిస్టులు దాడి చేసిన సంగతి తెలిసిందే. బస్తర్ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. దంతెవాడలో మరో దాడి చేశారు. మొత్తానికి మావోలు చేసిన ఆరుదాడుల్లో 14 మంది మృతి చెందారు. మృతిచెందిన వారిలో భద్రతాబలగాలు, సామాన్య పౌరులు ఉన్నారు.