ఆకాశాన్నంటుతున్న పూలు, పండ్ల రేట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ కోలాహలం నెలకొంది. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేషుడి మంటపాలు వెలిశాయి. విఘ్ననాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తోన్నారు జనం. హైదరాబాద్ లో ప్రతి చోటా గణేషుడి మండపాలు ఏర్పాటయ్యాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. ఖైరతాబాద్ వినాయకుడికి ఈ ఉదయం 11 గంటలకు ప్రథమపూజ చేయనున్నారు గవర్నర్.
పండగ నేపథ్యంలో.. పూల మార్కెట్లలో కొనుగోళ్ల సందడి ఒక్కసారిగా ఊపందుకుంది. పూల మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ డిమాండ్ కారణంగా ఈ రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో దాదాపుగా కోటి రూపాయలకు పైగా పూలు విక్రయం అయ్యాయి. కొన్ని రోజుల కిందటి వరకు మందకొడిగా సాగిన పూల వ్యాపారం.. వినాయక చవితి పండుగ రాకతో ఆకాశానికి అంటింది.

వినాయక చవితి పూజలలో వివిధ రకాల పూల ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రంగు రంగుల పూలకు డిమాండ్ అధికం. గణేషుడి మంటపాలు కనీసం అయిదు రోజుల పాటు ఉంచాల్సి రావడం వల్ల త్వరగా వాడిపోకుండా నిలిచే గుణం ఉన్న పూలను కొనుగోలు చేయడం సహజం. ఈ రకానికి చెందిన బంతి, చామంతి పూలను మండపాల అలంకరణకు, తోరణాలకు విరివిగా ఉపయోగిస్తారు. పూజ గదిలో సువాసన వ్యాపించేందుకు మల్లెలు, సంపంగి పూలను ఎంచుకుంటారు.
అలాగే గణపతి పూజలో విశిష్ట స్థానాన్ని పొందిన ఎర్ర మందారాలు, తామర పూల కొనుగోళ్లకు భక్తులు ఆసక్తి చూపుతుండటంతో వాటి రేట్లు భారీగా పెరిగాయి. గణనాథుడి మండపాలు, ఇళ్లను అందంగా అలంకరించడానికి భక్తులు పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేస్తోన్నారు. పెరుగుతున్న స్థానిక అవసరాలను తీర్చడానికి పూల వ్యాపారులు మహారాష్ట్రలోని సోలాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పూలను దిగుమతి చేసుకుంటున్నారు.

పండుగకు ముందు రోజుల్లో తాజా పూలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. హోల్సేల్ మార్కెట్లో లభించే ధరలతో పోలిస్తే.. రోడ్డు పక్కన ఉండే రిటైల్ వ్యాపారుల వద్ద పూల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. శుభకార్యాలకు వాడే పూలమాలలు సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి పూల దండల ధరలు విపరీతంగా పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెద్ద పరిమాణంలో ఉన్న పూల దండలు రూ. 800 వరకు, చిన్న దండలు రూ. 400 వరకు విక్రయం అవుతున్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కో పూల దండ ధర రూ. 100 కు మించదు. ఇలాంటి పెద్ద పండుగల సమయంలో ఎంత లేదన్నా 500 రూపాయల మార్కును దాటిపోతోంది. ఉత్సవాల అలంకరణకు వాడే పూల దండల తయారీలో శ్రమ, సమయం ఎక్కువగా పడుతుండటమే ఈ ధరల పెరుగుదలకు కారణమని విక్రయదారులు చెబుతున్నారు.
రేట్లు పెరగడం వల్ల చాలా మంది భక్తులు విడిగా బంతిపూలు కొనుగోలు చేసి, ఇంట్లోనే తోరణాలు, పూల మాలలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత మార్కెట్ యార్డ్ హోల్సేల్ ధరలను గమనిస్తే.. కిలో బంతి పూల ధర రూ. 250 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. అలాగే చామంతి పూలు రూ. 200 నుంచి రూ. 250, నిత్యమల్లి కిలో అత్యధికంగా రూ. 600 నుంచి రూ. 700 వరకు అమ్ముడవుతోంది.
పండ్ల ధరలు కూడా వీటికి ఏ మాత్రం తీసిపోవట్లేదు. యాపిల్స్ కిలో రూ. 300 వరకు పలుకుతోంది. దానిమ్మ పండ్ల ధర రూ.100 నుంచి రూ.250 వరకు ఉంటోంది. వినాయకుడికి ప్రీతిపాత్రమైన ఒక్కో వెలగపండు రూ. 75 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తోన్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, పండుగ కావడం వల్ల ప్రజలు కొనక తప్పట్లేదు.












Click it and Unblock the Notifications
