బెదిరిస్తున్నారు: తలసానిపై మర్రి ఫిర్యాదు, కెసిఆర్కు రోడ్డుకో రూ.లక్ష: కిషన్ సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
రాణిగంజ్ ప్రాంతంలో బస్తీవాసులను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు రక్షణ కల్పించాలని బస్తీ వాసులు కూడా పోలీసులను కోరారు.
రైతు ఆత్మహత్యలపై పోచారం
తెలంగాణలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు వందల మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం ఉందన్నారు.
ఇప్పటి వరకు 111 మంది రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చామని చెప్పారు. సెప్టెంబర్ నెలాఖరు కల్లా రుణమాఫీ రెండో దశ పూర్తవుతుందన్నారు. గత ప్రభుత్వాలు చేయని పనులు మా ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు బాధాకరమన్నారు. ఆత్మహత్యలను నివారిస్తామన్నారు.
దుర్భర హైదరాబాద్గా మారుస్తున్నారు: కిషన్ రెడ్డి
హైదరాబాదు నగరంలో రోడ్ల పరిస్థితి నరకంగా మారిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నగరాన్ని విశ్వనగరంగా చేస్తానని దుర్భర నగరంగా మారుస్తున్నారన్నారు.
గ్రేటర్ పరిధిలో ఒక్క గుంత చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఒక్క రోడ్డు బాగున్నట్లు చూపిస్తే తాను రూ. లక్ష ఇస్తానని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. గతంలో నెంబర్ వన్ సిటీగా ఉన్న హైదరాబాదు ఇప్పుడు దేశంలో 272వ స్థానానికి వచ్చిందన్నారు.
అర్చకులను రోడ్డున పడేసిన కెసిఆర్: శ్రవణ్
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేల ఫైళ్లు పెండింగులో ఉన్నాయని కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల పైన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్న సమయంలో రైతులపై చిన్నచూపు ఎలా అన్నారు. అర్చకులను రోడ్డున పడేసిన ఘనత కెసిఆర్దే అన్నారు.
నాపై కేసులు నిరాధారం: హరీశ్వర్ రెడ్డి
తన పైన పెట్టిన కేసులు నిరాధారమైనవని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి అన్నారు. ఈసి దగ్గర పెండింగులో ఉన్న కేసు నుంచి తప్పించుకోవడానికి ఫోర్జరీ పత్రాలతో తన పైన రామ్మోహన్ రెడ్డి కేసులు పెట్టారని ఆరోపించారు. ఆయన సిబిఐ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు నిజమని తేలితే రాజకీయాల నుంచితప్పుకుంటానని, అవాస్తవాలని తేలితే ఆయన సిద్ధమా అన్నారు.