టీ కాంగ్రెస్లో ఆధిపత్యపోరుః సీనియర్ల భేటీపై హై కమాండ్ సీరియస్ - తప్పేంటన్న శశిధర్ రెడ్డి, జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. తొలి నుంచి టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని ఆపార్టీలో కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏక పక్షంగా వ్యవహారిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. రేవంత్ను పీసీసీ అధ్యక్షపదవి నుంచి దించాలని పట్టుపడుతున్నారు. దీంతో టీ కాంగ్రెస్లో రేవంత్కు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలక వచ్చింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఓ హోటల్లో సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ సీనియర్ల భేటీ.. అధిష్టానం సీరియస్..
కాంగ్రెస్ సీనియర్ల ఈ ప్రత్యేక సమావేశానికి ఆపార్టీ నేతలు మరి శశిధర్ రెడ్డి, వీహెచ్, జగ్గారెడ్డి, కమలాకర్ రావు, శ్యామ్ మోహన్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరు కావాలని పలువురు సీనియర్లను వీహెచ్ ఆహ్వానించారు. సీనియర్ల భేటీపై కొందరు కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు. సీనియర్ల ప్రత్యేక భేటిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
దీంతో హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సీనియర్లకు ఫోన్ చేశారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. ఇలా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తే పార్టీకి వ్యతిరేకమనే భావన ప్రజలతో పాటు కార్యకర్తల్లో కూడా వెళ్లే అవకాశం ఉందని .. సమావేశానికి హాజరు కావద్దని కోరారు.
రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి సవాల్
దీంతో మేజారిటీ సీనియర్ నేతలు ఈ ప్రత్యేక సమావేశానికి డుమ్మా కొట్టారు. పెద్దగా ఎవరూ హాజరుకాకపోవడంతో ఈ సమావేశాన్ని సీనియర్లు అర్థాంతరంగా ముగించారు. తమ సమస్యలను పార్టీ అధిష్టానానికి తెలియజేయడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తాము చేస్తున్నదాంట్లో తప్పేమి లేదని పేర్కొన్నారు. పంజాబ్ తరహాలో పార్టీ నష్టమపోకూడదనే తమ తపన, ఉద్దేశమని చెప్పారు. పార్టీకి పూర్తిగా నష్టం జరిగాక చర్చించుకుంటే ఎలాంటి లాభం లేదని స్పష్టం చేశారు.
పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇస్తే సమాధానం చెబుతానని పేర్కొన్నారు. మమల్ని పార్టీ నుంచి సస్సెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తే రేవంత్ రెడ్డి హీరో అని ఒప్పుకుంటానని జగారెడ్డి సవాల్ విసిరారు. తనను సస్పెండ్ చేస్తే .. రోజుకో బండారం బయటపెడతానని హెచ్చరించారు.
పంజాబ్లో పరిస్థితి రాకూడదనే..
తమది అసమ్మతి సమావేశం కాదని మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తేల్చిచెప్పారు. గతంలోనూ చాలా సార్లు భేటీ అయ్యామని తెలిపారు. దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైంది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదన్న దానిపైనే తాము సమావేశమయ్యాం.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం మళ్లీ మళ్లీ సమావేశం అవుతుంటామని తేల్చిచెప్పారు.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వంపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. పార్టీలో అవసరమైన చోటా మార్పులు చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డిని టీపీసీపీ అధ్యక్షుడిగా చేసినా.. పంజాబ్లో చన్నీని సీఎం చేసినా అన్ని నిర్ణయాలను హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటుందన్న నమ్మకం తమకు ఉందని శశిధర్ రెడ్డి చెప్పారు.