ఎంత పని చేశావు తల్లీ: కూతురు చూస్తుండగానే ఉరేసుకుంది
హైదరాబాద్: నగరంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కూతురు చూస్తుండగానే ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేసన్ పరిధిలో చోటు చేసుకుంది. భర్తతో కలహమే ఆ తల్లి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
పేట్బషీరాబాద్ ఎస్సై ఎం వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం కొరిమిల్ల గ్రామానికి చెందిన సుంకరి స్వరాజ్యలక్ష్మి(26)కి... అదే ప్రాంతానికి చెందిన త్రిమూర్తులుకు ఐదేళ్లక్రితం వివాహమైంది.

వీరి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం నగరానికొచ్చి కొంపల్లి పరిధిలోని ఆదిత్య రాయల్పార్కులోని మానస రెసిడెన్సీలో నివాసముంటోంది. వీరికి బాబు(4) పాప(2) ఉన్నారు. త్రిమూర్తులు మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూడా మరోసారి గొడవపడ్డారు. కాగా, మంగళవారం ఉదయం పని వత్తిడిలో.. కుమారుడిని పాఠశాలలో వదలకుండానే వెళ్లిపోయాడు త్రిమూర్తులు. దీంతో మనస్తాపానికి గురైన స్వరాజ్యలక్ష్మి రెండేళ్ల కూతురు ముందే చీరకొంగుతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ సమయంలో బాబు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. కాగా, చిన్నారి ఏడుపు విన్న విని ఇరుగుపొరుగువారు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అప్పటికే స్వరాజ్యలక్ష్మి ఫ్యాన్కు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది.
తల్లి మృతితో ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ ఘటన అక్కడివారిని సైతం కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications