మాస్కులు తప్పనిసరి: ఎండమిక్గా, కరోనావైరస్ ఫోర్త్వేవ్పై డీహెచ్ శ్రీనివాస్ ఏమన్నారంటే.?
హైదరాబాద్: నగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలంగాణ హెల్త్ డైరెక్టర్(డీహెచ్) శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా, ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56 శాతానికిపైగా కేసులు పెరిగాయన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ డీహెచ్ శ్రీనివాసరావు
దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 36వేలకుపైగా ఉండగా.. తెలంగాణలో మాత్రం 811 ఉన్నాయని తెలిపారు డీహెచ్ శ్రీనివాసరావు. థర్డ్ వేవ్లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మళ్లీ గత రెండు వారాలుగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 811 యాక్టివ్ కేసులుంటే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కేవలం రెండు మూడు మాత్రమే చేరికలు ఉన్నాయన్నారు. మరణాలు కూడా గత రెండు నెలల నుంచి సున్నాగానే కొనసాగుతున్నాయన్నారు. గత మూడు రోజుల నుంచి 100కుపైగా కేసులు నమోదవుతున్నాయని డీహెచ్ వివరించారు. రెండున్నర నెలల తర్వాత మరోసారి ఈ స్థాయిలో కేసులు రావడం చూస్తున్నామన్నారు.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదన్న డీహెచ్ శ్రీనివాసరావు
అయితే, దేశంలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు కూడా తక్కువేనని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు అతి స్వల్పంగా ఉండే అవకాశం ఉందన్నారు. వ్యాక్సినేషన్ కవరరేజీ దాదాపు 100 శాతం కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగామన్నారు. ఇప్పుడు కేసులు పెరుగుతున్నా.. ఫోర్త్ వేవ్ కు కారణం కాకపోవచ్చని తెలిపారు. మే నెల నుంచి ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ2 కేసులే దాదాపు 65 శాతంగా ఉన్నాయని తెలిపారు. గత రెండు మూడు రోజుల నుంచి బీఏ4, బీఏ5 వేరియంట్ల సంబంధించిన కేసులు పెరుగుదల కనిపిస్తోందన్నారు. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు.
కరోనావైరస్ మహమ్మారి పూర్తి ఎండమిక్గా అప్పుడే..: డీహెచ్ శ్రీనివాస్
కరోనా వైరస్ మాత్రం ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని శ్రీనివాసరావు తెలిపారు. పూర్తిగా నిర్మూలన కావాలంటే మరింత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఎండమిక్ దశలో కొనసాగుతోందన్నారు. ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే ఆరు నెలల వరకు కరోనా కేసులు పెరుగుదల నమోదు కావచ్చని.. అయితే ప్రజలు ఆందోళన చెందకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. పిల్లలకు కూడా వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉన్నాయని, వారికి కూడా వ్యాక్సిన్ వేయించడం మరిచిపోవద్దన్నారు.