సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదం - రాకపోకలు నిలిపివేత : రూ 20 కోట్ల నష్టం..!!
పండుగ సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు .రూ 20 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లబ్లో మంటలు చెలరేగాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.
వీకెండ్ అందునా పండుగ రోజులు కావటంతో తెల్లవారు జాము వరకూ కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. జూబ్లీ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతానికి రాకపోకలను నిలిపివేశారు. చుట్టుపక్కల కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 1879లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ క్లబ్ నిర్మాణం జరిగింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేశారు.
సికింద్రాబాద్ క్లబ్లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, ప్రమాదం పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెబుతున్నారు.