భార్యపై కానిస్టేబుల్ అనుమానం: కత్తులతో దాడి, భర్త మృతి (ఫోటోలు)
హైదరాబాద్: కలకాలం కాపురం చేయాల్సిన భార్యభర్తలు అనుమనాలు పెంచుకుని, కక్షలతో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. ఫలితంగా భర్త మరణించగా, భార్య కటకటాలపాలైంది. సోమవారం మెదక్ జిల్లాలోని గజ్వేల్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తోట మండలం వెంకట్రావుపేటకు చెందిన మిద్దె నర్సింలు(40), 1996 నుంచి దౌల్తాబాద్ మండలం బేగంపేట పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి రామాయంపేట మండలం వెంకటాపూర్కు చెందిన బాలలక్ష్మితో 20 ఏళ్ల కిందట వివాహమైంది.
వీరిద్దరికీ ఇది రెండో పెల్లి. వీరికి నలుగురు ఆడపిల్లలు. గత కొద్ది కాలంగా భార్య బాలలక్ష్మిపై నర్సింలు అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానం చివరకు గొడవలకు దారితీసింది. రెండేళ్ల క్రితం పెద్ద కూతురు వివాహం ఘనంగా చేశారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి మధ్య గొడవలు మొదలు కాగా, బాలలక్ష్మి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.
దీంతో ఉన్నతాధికారులు దంపతులిద్దరికీ నచ్చజెప్పింది. తన పిల్లలను పోషించడానికి ఆస్తిని పంచమని ఆమె కోరింది. నర్సింలు ఒప్పుకోక తానే పోషించి పెళ్లిళ్లు చేస్తానని చెప్పగా, కుమార్తెలు అంగీకరించలేదు. దీంతో ఈ నెల11న బాలలక్ష్మి ఫిర్యాదు చేయగా గజ్వేల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యపై కానిస్టేబుల్ భర్త అనుమానం: కత్తులతో దాడి, భర్త మృతి
ఆ తర్వాత బాలలక్ష్మి తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లింది. ఇటీవల కానిస్టేబుల్ నర్సింలు గజ్వేల్ లక్ష్మి ప్రసన్న నగర్ కాలనీలోని తన ఇల్లు అమ్మకానికి పెట్టాడన్న విషయం భార్యకు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.45 సమయంలో బాలలక్ష్మి తన తల్లిదండ్రులైన ఎల్లమ్మ, రాములు, అన్న భీములు, పిల్లలతో కలసి గజ్వేల్కు వచ్చింది.
భార్యపై కానిస్టేబుల్ భర్త అనుమానం: కత్తులతో దాడి, భర్త మృతి
అక్కడ ఇరువురి మధ్యమాటామాటా పెరిగి, తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో నర్సింలు ముందుగా మామ రాములుపై కత్తితో దాడిచేయగా, అతడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఇది చూసి భరించలేని బాలలక్ష్మి ఆవేశంతో కత్తితో భర్త గొంతుపై నరకడంతో గొంతు తెగి తీవ్ర రక్తం కారడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.
భార్యపై కానిస్టేబుల్ భర్త అనుమానం: కత్తులతో దాడి, భర్త మృతి
ఈ ఘటనలో రాములును హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించగా, బాలలక్ష్మి అన్న భీములుకు కూడా గాయాలయ్యాయి. అయితే అతని ఆచూకీ ఇంకా లభించలేదు. నర్సింలు హత్య కేసులో బాలలక్ష్మి తల్లిదండ్రులు ఎల్లమ్మ, రాము లు, అన్న భీములు, ఆమె కూతుళ్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.
భార్యపై కానిస్టేబుల్ భర్త అనుమానం: కత్తులతో దాడి, భర్త మృతి
సంఘటన స్థలానికి క్లూస్టీం చేరుకుని ఆధారాలు సేకరించింది. కానిస్టేబుల్ నర్సింలు హత్యకు గురైన సంఘటన వెంటనే పట్టణమంతా వ్యాపించడంతో మృతదేహాన్ని చూడడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా నర్సింలుకు తల్లిదండ్రులు మరణించగా ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.