మేడారంలో భావోద్వేగం.. గద్దెలపైకి సారలమ్మ, గోవింద రాజులు, పగిడిద్ద రాజులు!
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో తొలిఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ప్రతి సన్నివేశం ఆదివాసీ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. నాలుగు రోజుల పాటు జరిగే మహాజాతరలో తొలిరోజు ప్రధాన ఘట్టం సారలమ్మ ఆగమనం అత్యంత భావోద్వేగ భరితంగా సాగింది.
అధికారుల ఆహ్వానంతో మేడారానికి కదిలిన సారలమ్మ
మేడారం జాతరలో తొలి ఘట్టంగా, మేడారానికి సుమారు ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మ మేడారం గద్దెలకు అధికారిక లాంఛనాలతో విచ్చేసింది. కన్నెపల్లి గుడి నుంచి కోయ పూజారులు సారలమ్మను బయటికి తీసుకువచ్చే విధానం అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా సాగింది.లక్షలాది భక్తుల నడుమ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి తరలివచ్చిన ఆదివాసీలు, గుత్తికోయల సంప్రదాయ నృత్యాల మధ్య సారలమ్మ ఆగమనం ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

సారలమ్మ కోసం వరాలు పట్టిన భక్తులు
జిల్లా కలెక్టర్ స్వయంగా అమ్మవారికి అధికారికంగా స్వాగతం పలకగా, పోలీసు శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ వెళ్లే మార్గమంతా వందలాది మంది భక్తులు దారిపై పడుకొని పాణాసారాలు పడ్డారు. దీనినే 'వరాలు పట్టడం'గా పిలుస్తారు. సారలమ్మ తమపై నుంచి వెళితే కష్టాలు, అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
సారలమ్మ రాకకు కోయల తన్మయత్వం
సారలమ్మ రాకకు గంట ముందే కోయలు వాయించే డోలు వాయిద్యాలు హోరెత్తాయి. ఆ డోలు మోగింపుతో అక్కడి వాతావరణం పూర్తిగా ఆధ్యాత్మిక తన్మయత్వంలోకి మారింది. శిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానించే మహిళల భక్తి తన్మయత్వం అక్కడ కనిపించింది.గుడి వెలుపల ఛత్తీస్గఢ్కు చెందిన గుత్తి కోయలు తమదైన ప్రత్యేక అలంకారాలు, వేషధారణలతో చేసే నృత్యాలు గిరిజన సంస్కృతిని అద్భుతంగా ప్రతిబింబించాయి.

సంప్రదాయ పూజలతో సారలమ్మ రాక
కన్నెపల్లి ఆదివాసీ యువతులు ముందుగా సారలమ్మ గుడిని అలికి, ముగ్గులు వేయడం ద్వారా సారలమ్మ రాకకు శ్రీకారం చుట్టారు. అనంతరం వడ్డెలు గుడిలో సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ తర్వాత మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పూజల్లో పాల్గొన్నారు. ఆపై గుడిలో నుంచి తెల్లని వస్త్రంతో తయారు చేసిన హనుమంతుడి బొమ్మతో ఉన్న పతాకంతో వడ్డెలు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఇదే సారలమ్మ రాకకు సంకేతం.

భక్తులపై నుంచి నడిచిన సారలమ్మ
సారలమ్మతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం, దారిపై పడుకొని ఉన్న వందలాది భక్తులపై నుంచి సారలమ్మను తీసుకెళ్లుతూ వడ్డెలు కన్నెపల్లి గ్రామమంతా పర్యటించారు. గ్రామస్తులు తమ ఇళ్ల ముందు నీళ్లు ఆరపోసి, కొబ్బరికాయలు సమర్పిస్తూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కన్నెపల్లి ఆలయం పరిసర ప్రాంతం కనీసం అర కిలోమీటర్ మేర భక్తులతో కిటకిటలాడింది.
సారలమ్మ ఆగమనం.. మహా జాతరకు నాంది
రాత్రి కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మ, మధ్యలో ఉన్న జంపన్న వాగును దాటి రాత్రి 12.25 గంటలకు మేడారం గద్దెలను చేరుకుంది. ఇదే సమయంలో గోవిందరాజులు, పగిడిద్ద రాజులు కూడా వారి వారి గద్దెలపైకి చేరుకోవడంతో, మేడారం జాతర తొలి రోజు కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. పూర్తిగా కోయ గిరిజన సంప్రదాయంతోనే జరిగిన ఈ సారలమ్మ ఆగమనం, మేడారం మహాజాతర వైభవానికి నాందిగా నిలిచింది.












Click it and Unblock the Notifications