మేడారం జాతర హుండీల ఆదాయం13.25కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతర సమయంలో ఏర్పాటుచేసిన హుండీలలో అమ్మవార్లకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగింది.
మేడారం మహాజాతర హుండీల ఆదాయం ఇదే
ఈనెల 5వ తేదీ నుంచి హన్మకొండలోని టిటిడి కళ్యాణమండపంలో నిర్వహించిన లెక్కింపు ప్రక్రియలో మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలను తెరిచి అమ్మవారికి భక్తులు సమర్పించిన నగదును, ఆభరణాలను, కానుకలను లెక్కించారు. నిన్నటితో హుండీల లెక్కింపు ప్రక్రియ ముగియగా మొత్తం 13 కోట్ల 25 లక్షల 83 వేల 269 రూపాయల ఆదాయం 2026 మేడారం మహా జాతరలో వచ్చినట్టు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

మేడారం మహా జాతరకు భారీగా ఆదాయం వస్తుందని అంచనా
హుండీలలో నగదు తో పాటు విదేశీ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాలు, రద్దు అయిన నోట్లు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 మేడారం మహా జాతరలో మొత్తం 540 హుండీలను ఏర్పాటు చేయగా 13 కోట్ల 25 లక్షల 22 వేల 511 రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేశారు. ఆదాయం భారీగా వస్తుందని అంచనా వేశారు.
మేడారం జాతర ఆదాయం పరిమితంగానే
మేడారం మహా జాతరకు గతంలో ఎరుగని విధంగా భారీగా ఖర్చు కూడా పెట్టారు. గతంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ మేడారం మహా జాతర ఆదాయం పెరుగుదల పరిమితంగానే ఉండడం, కేవలం వేల రూపాయలు మాత్రమే తేడా రావడం ప్రధానంగా కనిపిస్తుంది.
హుండీ ఆదాయంలో 33 శాతం
మేడారం మహా జాతరలో వచ్చిన ఆదాయంలో 1/3 ఆదాయాన్ని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయ పూజారులకు పంచుతారు. అమ్మవార్ల వద్ద, పగిడిద్దరాజు, గోవిందరాజుల వద్ద ఏర్పాటు చేసిన హుండీలను విడివిడిగా లెక్కించి వచ్చిన ఆదాయంలో నుంచి 33 శాతం ఆదాయాన్ని ఆలయ పూజారులకు ఇస్తారు. మిగిలిన ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి, నిర్వహణకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బ్యాంకులో జమ చేసి అవసరాన్ని బట్టి ఆలయ అభివృద్ధికి, నిర్వహణకు ఈ నిధులను వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications