నేటి నుండే మేడారం మహా జాతర సంరంభం .. సారలమ్మ ఆగమనంతో తొలి ఘట్టం
నేటి నుండి మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. అన్ని దారులు మేడారం వైపే సాగుతున్నాయి. తల్లీ బిడ్డలను ఒకచోట చేర్చి ప్రణమిల్లె సమయం కోసం కోట్లాది భక్త జనం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నేడు మహా జాతరలో మొదటి ఘట్టం అయిన సారలమ్మ గద్దెపైకి వచ్చే అపూర్వ ఘట్టానికి మేడారం సన్నద్ధమైంది. సారలమ్మ రాకను కనులారా వీక్షించేందుకు మేడారం జన సంద్రంగా మారింది. ఇక నేడు మధ్యాహ్నం మూడుగంటల నుంచే సారలమ్మను గద్దెను తీసుకొచ్చే ప్రక్రియ మొదలవుతుంది.
Recommended Video

భక్తజన గుడారంగా మేడారం
ఇక నేడు మహాజాతర తొలి ఘట్టం అయిన సారలమ్మ ఆగమనం సందర్భంగా మేడారం భక్తజన గుడారంగా మారింది. కనుచూపు మేరలో ఎటుచూసినా భక్తజనమే దర్శనం ఇస్తుంది . చెట్టు, పిట్టా , గట్టు, గుట్ట అన్నీ ఆ తల్లుల ఆగమనానికే ఎదురు చూస్తున్నాయి. చీమల దండులా తరలివస్తున్న భక్త జనం శరణు ఘోషతో మేడారం మార్మోగుతోంది. కోయ దొరల సందడి , శివసత్తుల చిందులు , మొక్కులు చెల్లించటానికి నిలువెత్తు బంగారంతో బంగారు తల్లులను దర్శించటానికి వస్తున్న భక్తులు మేడారం అంతా భక్తి పారవశ్యంతో ఓలలాడుతుంది .

జాతర తొలిఘట్టానికి ముస్తాబైన కన్నెపల్లి గ్రామం
మేడారంతోపాటు పరిసర గ్రామాలన్నీ వనదేవతలను దర్శించుకోటానికి వచ్చిన భక్తులతో క్రిక్కిరిసిపోయాయి . తల్లుల ఆగమన సమయం ఆసన్నమవుతుండడంతో భక్తుల రాక పోటెత్తుతోంది. ఇక నేడు సారలమ్మతో పాటు పూనుగండ్ల నుంచి వస్తున్న పగిడిద్దరాజు, కొండాయి నుంచి వస్తున్న గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరనున్నారు. సారలమ్మ కొలువైన కన్నెపల్లి గ్రామం జాతర తొలిఘట్టానికి ముస్తాబైంది.

కన్నెపల్లిలో పండుగ వాతావరణం
ప్రతీ ఇంటి ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంది , ఇంటి గోడకు పుట్టమన్ను, ఎర్రమన్నును పూసి ముత్యాల ముగ్గులు వేసి ఆ ఊరి ఆడబిడ్డలంతా కన్నెపల్లిని అందంగా తీర్చిదిద్దారు. తమ ఊరి ఆడబిడ్డను తల్లి చెంతకు చేర్చేందుకు కన్నెపల్లి వాసులంతా ఉత్సాహంతో ఉన్నారు. తల్లి, బిడ్డలను ఒక్కచోటకు చేర్చితే వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. సారలమ్మను తీసుకొచ్చేందుకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది .

గిరిజన సాంప్రదాయాల ప్రకారం సారలమ్మ పూజలు
ఇక నేడు సారలమ్మను గద్దె మీదకు తీసుకువచ్చేందుకు ముందుగా ప్రధాన వడ్డె-పూజారి కాక సారయ్య నేతృత్తంలోని వడ్డెలు కన్నెపల్లి సారలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గద్దెపైకి అమ్మవారిని తీసుకొస్తారు . అప్పటికే మేడారం చేరుకున్న పగిడిద్దరాజు సారలమ్మ రాక కోసం వేచి చూసే సంప్రదాయం మొదట నుండీ ఉంది. ఇవాళ మధ్యాహ్నం మేడారానికి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండాయి నుంచి గోవింద రాజులును గద్దెకు తీసుకు వస్తారు. మేడారానికి సారలమ్మ రాక, గోవిందరాజులురాక దాదాపుగా ఒకే సమయంలో జరుగుతాయి.

తడిబట్టలతో పొర్లుదండాలు పెడుతూ సారలమ్మకు ఆహ్వానం
రెండు గంటలపాటు గుడిలో ప్రత్యేక పూజాలను నిర్వహించిన అనంతరం సాయంత్రం 5గంటలకు బయలుదేరుతుంది. సారలమ్మ రాక కోసం భక్తులు తడిబట్టలతో పొర్లుదండాలు పెడుతూ గుడివద్ద మోకరిల్లుతారు. మేడారం మహా జాతరలో తొలి ఘట్టం సారలమ్మ ఆగమనం అయినా అంతకు ముందే పగిడిద్ద రాజు ఆగమనం జరుగుతుంది . మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిద్దరాజు నేడు సాయంత్రానికి గద్దె వద్దకు చేరుకుంటారు.

తొలిగా పగిడిద్ద రాజు ఆగమనం ..
పూనుగొండ్ల నుంచి డప్పు వాయిద్యాల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి పడిగె రూపంలో ఉన్న పగిడిద్ద రాజును తీసుకువస్తారు వడ్డెలు . వీళ్ళ ప్రయాణం అంతా అటవీప్రాంతంలో కాలినడకన సాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం రెండుగంటలకు బయలుదేరిన పగిడిద్దరాజు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురంలో రాత్రి బస చేశారు. ఇవాళ తెల్లవారు జామున ప్రత్యేక కోయ సంప్రదాయాలతో పూజలు చేసి సాయంత్రం వరకు మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంటారు.

ఒకేసారి సారలమ్మ , గోవిందరాజుల ఆగమనం .. మహా జాతర షురూ
అటు పగిడిద్దరాజు గద్దెకు చేరుకోగానే కొండాయి నుంచి గోవిందరాజులు , కన్నెపల్లి నుంచి సారలమ్మ జంపన్న వాగును దాటి గద్దెల పైకి తీసుకువచ్చే ఘట్టం కొనసాగుతుంది. జాతరలో సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలకు చేరటంతో ఒక ప్రధాన ఘట్టం ముగుస్తుంది. దీంతో గద్దెలపై కొలువు తీరే సారలమ్మ భక్తులకు దర్శం ఇస్తారు. ఈ ముఖ్య ఘట్టంతో జాతర ఊపందుకుంటుంది . మేడారంలో మహా జాతర షురూ అవుతుంది .












Click it and Unblock the Notifications