రంగారెడ్డి జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్లో వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బుధవారం మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మేడ్చల్, శామీర్ పేట మండలాల్లో టీడీపీ పూర్తిగా తుడుచుకు పోయింది. తెలుగుదేశం పార్టీ ముమ్మాటికీ పక్క రాష్ట్రం పార్టీయేనని ఆయన చెప్పారు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారన్నారు.
తెలుగుదేశం పార్టీని ఏపీకి సంబంధించిన పార్టీగా ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ హైకమాండ్ తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉందన్నారు. కాగా భారతదేశంలోనే అత్యధికంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందన్నారు.
పెన్షన్ల కోసమే సంవత్సరానికి రూ. 4,400 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. మనిషికి ఆరు కిలోల బియ్యం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో సంక్షేమ హాస్టళ్లకు సన్న బియ్యం ఇస్తున్నారన్నారు.
తెలంగాణలోని నిరుపేద యువతుల కోసం ఎవరు అడగకుండానే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని మెచ్చుకున్నారు.