నెల క్రితమే పెళ్లి: హాస్టల్ గదిలో వైద్య విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డెర్మటాలజీలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెకు నెల రోజుల క్రితమే వివాహమైంది. ఆమె స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని మన్రీలియగూడెం.
గత నెల 27వ తేదీన సౌమ్యకు వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇంటి నుంచి మళ్లీ కాలేజీకి వచ్చిన సౌమ్య ఆత్మహత్య చేసుకోవడం వెనక కారణాలేమిటనేది తెలియడం లేదు.
నల్లగొండ జిల్లాకు చెందిన పవన్ కుమార్ రెడ్డి అనే యువకుడికి ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి మంగళవారంనాడు కాలేజీకి వచ్చింది. హాస్టల్ గదిలో వదిలిపెట్టిన అతను వెళ్లిపోయాడు. ఆ రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
తమ సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని సౌమ్య సోదరుడు అంటున్నారు. పోలీసులు భర్త కోసం ఆరా తీస్తున్నారు. భర్త పవన్ కుమార్ రెడ్డి కూడా వైద్యుడే. భర్త మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీలో ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.