మీడియా ముందుకు మీర్పేట ట్రిపుల్ మర్డర్ నిందితుడు: హత్యలపై ఏం చెప్పాడంటే?..
మీర్పేటలో భార్యా పిల్లల్ని హతమార్చిన నిందితుడు హరీందర్ గౌడ్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. క్షణికావేశంలోనే హత్య చేయాల్సి వచ్చిందని చెప్పిన నిందితుడు.. మీడియా ప్రతినిధులు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయాడు. హత్యలకు సంబంధించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు.
Recommended Video
ట్రిపుల్ మర్డర్: ఊరికెళ్తే బతికేవారే, చంపి కాలనీ ప్రెసిడెంట్కు చెప్పాడు
హరీందర్ గౌడ్ స్టేట్మెంట్:
ఆర్థిక పరిస్థితులు బాగా లేక మానసికంగా కుంగిపోయాను.భార్యతో గొడవలు ఏర్పడ్డాయి. క్షణికావేశంలోనే భార్యను, పిల్లలనూ హత్య చేశాను. అని నిందితుడు చెప్పాడు. పిల్లలను చంపినందుకు పశ్చాత్తపడట్లేదా? అని ప్రశ్నించినందుకు హరీందర్ మిన్నకుండిపోయాడు.
భార్యతో విభేదాలు..:
హరీందర్ గౌడ్కు జ్యోతికి 2009లో పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత చాలాకాలం సంతోషంగానే ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లెలగూడలో సొంతం ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. హరీందర్కు తన స్వంత గ్రామంలో 5 ఎకరాల పొలం ఉందని, అప్పులు కూడా లేవని చెప్పారు.
హత్యకు కారణాలివే:
జీవనోపాధి కోసం హరీందర్ గౌడ్ డెంటల్ ల్యాబ్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గత కొన్నాళ్లుగా అది నష్టాల్లో ఉండటంతో.. రెండు, మూడు నెలల నుంచి ఇంటి వద్దే ఉంటున్నట్లు చెప్పారు. భర్త ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉండటంతో భార్య వారించేదని ఈ క్రమంలో ఇద్దరి మనస్పర్థలు తలెత్తి అవి కాస్త హత్యకు దారితీశాయని చెప్పారు.
జిల్లెలగూడలో సంఘటన..:
ఈ నెల 4వ తేదీ హైదరాబాద్ లోని జిల్లెలగూడ సుమిత్ర ఎన్క్లేవ్లో ఈ హత్యలు చోటు చేసుకున్నాయి. ఆరోజు ఉదయం భార్యతో గొడవ జరగడంతో హరీందర్ విచక్షణను కోల్పోయి తన భార్య జ్యోతి, కుమారుడు అభిజిత్(6), కూతురు సహస్ర(4)లను దారుణంగా హత్య చేశాడు. భార్యను గోడకేసి బలంగా కొట్టి, పిల్లల గొంతు నులిమి చంపేశాడు.