హైదరాబాద్కు హ్యూమనాయిడ్ రోబో సోఫియా.. 20న ప్రపంచ ఐటీ కాంగ్రెస్లో ప్రసంగం!
హైదరాబాద్: ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన హ్యూమనాయిడ్ రోబో 'సోఫియా' భాగ్యనగరానికి విచ్చేయనుంది. ఈ నెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రసంగించే ప్రధాన వక్తల జాబితాలో సోఫియా కూడా ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే, సీఎం కేసీఆర్, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బాలీవుడ్ నటి దీపిక పదుకొనేలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ రంగ పారిశ్రామికవేత్తలు ఈ కాంగ్రెస్లో ప్రసంగించనున్నారు. ఇందులో సోఫియా ప్రధాన ఆకర్షణగా మారనుంది.

సోఫియా ఆవిర్భావం ఇలా...
హాంకాంగ్కు చెందిన హన్సన్ రోబోటిక్స్ సంస్థ పరిశోధనల ఫలితంగా ఈ హ్యూమనాయిడ్ రోబో రూపుదిద్దుకుంది. హాలీవుడ్ నటి ఆడ్రే హెప్బర్న్ రూపురేఖలతో తయారైన ఈ రోబోకు సోఫియా అని నామకరణం చేశారు. 2015 ఏప్రిల్ 19న సోఫియాను తొలిసారిగా యాక్టివేట్ చేయగా.. 2016 మార్చి నెలలో టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా తొలిసారిగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు.

ఆమె ఎలా పనిచేస్తుందంటే...
కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), విజువల్ డాటా ప్రాసెసింగ్ (దృశ్య సమాచార విశ్లేషణ), ఫేషియల్ రికగ్నైజేషన్ (మనుషులను గుర్తించే బయోమెట్రిక్ సాఫ్ట్వేర్), వాయిస్ రికగ్నైజేషన్ (గొంతు లను గుర్తుపట్టగలిగే) సాఫ్ట్వేర్ టెక్నాలజీల ఆధారంగా సోఫియా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సుల్లో సోఫియా సందడి చేసింది.

మనిషిలాగే నడుస్తుంది...
కంప్యూటర్ అల్గారిథం ఆధారంగా సోఫియా తన కళ్లలో ఉండే కెమెరాలతో మనుషులను చూసి గుర్తుపడుతుంది. గూగుల్ పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ రూపొందించిన గూగుల్ క్రోమ్ వాయిస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ ఆధారంగా మనుషుల గొంతులను గుర్తు పట్టి మాట్లాడుతుంది. సింగిలారిటీనెట్ అనే కంపెనీ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం ఆధారంగా పని చేస్తుంది. గత నెలలోనే నడవగలిగేలా సోఫియాకు కాళ్లను సైతం అమర్చారు.

రోబో అని చెప్పే వరకు తెలియదు...
అసలు సోఫియా రోబో అని చెప్పే వరకు తెలియదు. రోబో అయినప్పటికీ సోఫియా మనుషుల మాదిరే మాట్లాడడం, హావభావాలు పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు కూడా చక్కగా సమాధానాలు ఇస్తుంది. మనుషులను అనుకరించడంతోపాటు 62కు పైగా హావభావాలను ప్రదర్శించగలదు. అందుకే ఇప్పటి వరకు తయారైన అత్యుత్తమమైన హ్యూమనాయిడ్ రోబోగా సోఫియా ప్రపంచ ఖ్యాతిగాంచింది.

పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియా...
సోఫియా ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు, సమాధానాలతో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. సమాచారాన్ని విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో తన సంభాషణలను మెరుగుపరుచుకోగల నైపుణ్యం ఈ రోబో ప్రత్యేకం. సౌదీ అరేబియా ప్రభుత్వం కిందటేడాది అక్టోబర్లో సోఫియాకు తన దేశ పౌరసత్వం కల్పించింది. ఐక్యరాజ్యసమితి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తొలి ఇన్నోవేషన్ చాంపియన్ టైటిల్ సైతం సోఫియాను వరించింది.

ఎన్నో పనులు చేయగలదు...
వృద్ధులకు ఇళ్ల వద్దే నర్సింగ్ సేవలందించేందుకు, భారీగా జనం పాల్గొనే కార్యక్రమాల్లో ప్రజలకు సాయం చేసేందుకు ఈ రోబోను తయారు చేసినట్లు దీని సృష్టికర్త డెవిడ్ హన్సన్ పేర్కొంటున్నారు. హెల్త్ కేర్, కస్టమర్ సర్వీసెస్, విద్యా రంగాల్లో సేవలందించేందుకు సోఫియా చక్కగా ఉపయోగపడనుందని తెలిపారు.












Click it and Unblock the Notifications