16 ఏళ్ల తర్వాత రికార్డ్ వర్షం, ఐనా నిండని జలాశయాలు (పిక్చర్స్)
హైదరాబాద్: భారీ వర్షం భాగ్యనగరంలో బుధవారం నాడు బీభత్సం సృష్టించింది. ఉదయం ఆరున్నర ఏడు గంటలకు చిన్న చినుకులతో ప్రారంభమైన వర్షం.. కుంభవృష్టిగా మారింది. మూడు నాలుగు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది.
నగరాన్ని చిగురుటాకులా వణికించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో జనజీవనం స్తంభించిపోయింది. నాలాలు, మ్యాన్హోళ్లు పొంగి పొర్లాయి. రోడ్ల పైన మోకాళ్ల లోతు నుంచి అంతకు పైకి నీరు చేరాయి. కాలనీలు, బస్తీలు నీటమునిగాయి.
వర్షం దెబ్బకు దాదాపు 200 కాలనీలు, బస్తీలు నీటిలో మునిగిపోయాయి. రామంతపూర్లో గోడ కూలి నలుగురు మృతి చెందగా, భోలక్పూర్లో పాత ఇల్లు కూలిన ఘటనలో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. కాగా, మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిలిచిన ట్రాఫిక్
వర్షపు నీళ్లతో ట్రాఫిక్కు గంటల తరబడి నిచిలిపోయింది. ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎస్ఆర్నగర్, అమీర్పేట, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, కోఠి, మలక్పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్ తదితర రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇటీవలి కొన్నేళ్లలో ఇంత భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి.
చల్లబడిన నగరం
మూడు నాలుగు గంటల పాటు కురవడంతో 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన నాలుగైదు రోజులుగా పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ఉక్కపోతకు గురైన నగరం బుధవారం కురిసిన భారీ వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది.
రికార్డ్ స్థాయి వర్షం
రికార్డు స్థాయిలో వర్షం కురవటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో గంటల తరబడి ఎడతెరపి ఏకుండా వర్షం కురవటంతో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం ఉద్యోగులకు గంట సేపు మినహాయింపునివ్వగా, పలు ప్రయివేటు పాఠశాలలు సెలవును ప్రకటించాయి.
భారీ వర్షం
కొన్ని ప్రాంతాల్లో పన్నెండు సెంటీమీటర్ల మేరకు వర్షం కురవటంతో డ్రైనేజీలు, నాలాలు, వరద నీటి కాలువలు పొంగి ప్రవహించాయి. రద్ధీగా ఉండే జంక్షన్లలో, రోడ్లపై మొకాలిలోతు వరకు వర్షపు నీరు నిలవడంతో వాహన రాకపోకలు తీవ్రంగా స్తంభించాయి.
మూడు అడుగుల నీరు
నిమ్స్ ఆసుపత్రి ఎదుట, లక్డీకాపూల్లో దాదాపు మూడు అడుగుల ఎత్తు వరకు వర్షపు నీరు నిలిచింది. ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలోకి నీరు రావటంతో రోగులు ఇబ్బందుల పాలయ్యారు. ట్యాంక్బండ్, సికిందరాబాద్ ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో జిహెచ్ఎంసి సిబ్బంది వాటిని తొలగించింది.
నగరంలో వర్షపాతం
బుధవారం నగరాన్ని ఓ కుదుపు కుదిపిన భారీ వర్షం వివిధ రకరకాలుగా నమోదైంది. అంబర్పేటలో అత్యధికంగా 12.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత సైదాబాద్ మండలంలోని మల్కాపూర్లో 92.75 సెం.మీ.ల వర్షం నమోదైంది. ఖైరతాబాద్ మండలంలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో 79.25 సెం.మీలు, అదే మండలం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో 71.75 సెం.మీలు, అలాగే మారెడ్పల్లి మండలంలోని వెస్ట్ మారెడ్పల్లి ప్రాంతంలో 1.75 సెం.మీల వర్షపాతం నమోదయింది.
రంగారెడ్డి జిల్లాలో..
నగర శివారు, రంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో ఆరా తీశారు. మూసి, ఈసి, కాగ్నా నదుల పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అందుబాటులో..
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ అధికారులు తక్షణ అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది చెరువులు, కుంటలు తెగే పరిస్థితి అంచనా వేసి అధికారులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య చికిత్సకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.
అందుబాటులో..
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ అధికారులు తక్షణ అత్యవసర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ సిబ్బంది చెరువులు, కుంటలు తెగే పరిస్థితి అంచనా వేసి అధికారులు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య చికిత్సకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.
పదహారేళ్ల తర్వాత
వర్షాకాలంలో చెరువులు నిండక, భూగర్భ జలాలు ఇంకిపోతు శివారు త ప్రజలు తాగేందుకు నీరు సైతం కరవవుతున్న తరుణంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి జంట నగరాలతోపాటు శివారు మండలాలు జలమయమయ్యాయి. పదహారేళ్ల తర్వాత ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనుకున్న స్థాయిలో నిండలేదు
అనుకున్నంత స్థాయిలో శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నిండకపోయినా ఫర్వాలేదనే పరిస్థితి నెలకొంది. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్కు ఆశించిన నీరు రాలేదు. కాంక్రీట్ జంగిల్గా మారిన శివారు కాలనీలలో వర్షపునీటి వరద మోకాలు లోతులో ప్రవహించడంతో ఒక్కసారిగా పరిసర కాలనీలలో నుండి వచ్చిన వరద నీటితో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
మేయర్ పర్యటన
వర్షం నేపథ్యంలో మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో పర్యటించారు. హుటాహుటిన జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని కంట్రోల్ రూంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టం పెరిగిందని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని కొత్తగా ఏర్పాటుచేసిన తూము ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు.
కేటీఆర్
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైతం వర్షం ద్వారా తలెత్తుతున్న ఇబ్బందులు తెలుసుకొని నేరుగా ఢిల్లీనుంచి గాంధీ దవాఖానకు చేరుకొని గోడలు కూలిన ఘటనల్లో మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం హుస్సేన్ సాగర్ నుంచి నీటి విడుదలను స్వయంగా పరిశీలించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్
మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్రెడ్డి ఉదయం నుంచే అధికారులను అప్రమత్తం చేశారు. సర్కిళ్లవారీగా డిప్యూటీ కమిషనర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వర్షం కారణంగా అంతా తమ ప్రయాణాలను కనీసం గంటపాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు కార్యాలయాలకు గంటపాటు ఆలస్యంగా వెళ్లేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి సాధించారు.