మోడీని 48 సార్లు కలిశాం: ఎంపి వినోద్

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని టిఆర్ఎస్ ఎంపి వినోద్ ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్సింగ్ చివరి కేబినెట్ సమావేశంలో తెలంగాణ నుంచి 7మండలాలను వేరుచేయాలని తీర్మానం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.
సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయన్న కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ ఆర్డినెన్సును అట్టిపెడితే ఎన్నికల తర్వాత ప్రధానిగా మోడీ అమలు చేశారని వెల్లడించారు. అయినా తాము ప్రతిరోజు లోక్సభను స్తంభింపజేసి ఆర్డినెన్సును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిన విషయం ప్రపంచమంతా గుర్తించినా కాంగ్రెస్ నేతలు అంగీకరించడం లేదన్నారు.
చివరి కేబినెట్ తీర్మానం అమలుకోసం జైరాం రమేశ్ ఎన్డీఏ ప్రభుత్వం చుట్టూ తిరగలేదా అని వినోద్ ప్రశ్నించారు. సోనియా గాంధీ చేత ప్రధానికి ఈ విషయంలో లేఖ రాయించింది కాంగ్రెస్ పార్టీ నేతలో కాదో వెల్లడించాలని ఎంపీ వినోద్కుమార్ కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. ఆర్డినెన్సును అడ్డుకునేందుకు లోక్సభలో గొంతు చించుకొని మాట్లాడితే.. చివరకు స్పీకర్ కోర్టుకు వెళ్లమని సూచించారని అన్నారు.
టీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎంపీలందరం అడ్డుకుంటే కాంగ్రెస్ నుంచి ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. కరెంట్ విషయంలో వివక్ష చూపిస్తున్నారని, సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టు తెలంగాణకు రాకుండా అడ్డుకున్నారని, రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా మంచి సూచనలు చేసి చర్చ జరిగేలా చూశామన్నారు. ప్రతీ అంశంపై తాము లోక్సభలో ప్రశ్నలు లేవనెత్తితే.. ప్రధానిని చూస్తే టీఆర్ఎస్కు లాగులు తడుస్తాయనడం విడ్డూరంగా ఉందన్నారు.
వైఎస్ హయాంలో తెలంగాణ పేరెత్తితేనే కాంగ్రెస్ నేతలకు లాగులు తడిచేవని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ ఎక్కడ కొరడా తీస్తారోనని భయపడేవారని, అలాంటి వైఎస్ను ఉద్యమాలతో టిఆర్ఎస్ గడగడలాడించిందని అన్నారు. తమకు పదవులు గడ్డిపోచతో సమానమని వినోద్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలు వాస్తవాలను తెలుసుకోలేక మీడియాలో ప్రచారం కోసం తప్పుడు విమర్శలు చేస్తుండటం దారుణమని ఎంపీ ధ్వజమెత్తారు. ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పుడు సాధించలేని విద్యుత్ ఉత్పత్తి కేవలం నాలుగు నెలల్లోనే సాధ్యపడుతుందా అని ఆయన ప్రశ్నించారు. అధికారం కోల్పోగానే నిరాశ, నిస్పృహకు లోను కావడం వల్లే కాంగ్రెస్ నేతలు ఈ రకంగా మాట్లాడుతున్నారని వినోద్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications