మెట్రో లో ఉద్యోగాలు..! 80 లక్షలు వసూలు.. అడ్డంగా దొరికిన జంట
హైదరాబాద్ : మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసానికి పాల్పడింది ఓ జంట. నిరుద్యోగులకు గాలం వేసి 80 లక్షల రూపాయల మేర వసూలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వెలగపూడి రామకృష్ణ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చాడు. ఆ క్రమంలో మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. ఇద్దరి మనసులే కాదు మైండ్ సెట్ కూడా కలవడంతో సహజీవనం చేస్తున్నారు. దీంతో సులువుగా డబ్బులు సంపాదించాలని డిసైడయ్యారు.
మెట్రో రైలు డిపార్టుమెంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు గాలం వేశారు. 150 మందికి పైగా వీరి బారిన పడి మోసపోయారు. ఈ మోసంలో ప్రధాన పాత్ర పోషించిన రామకృష్ణ.. అతని బావమరిది లక్ష్మణ్ (మిషన్ భగీరథ ప్రాజెక్టు డీఈ) తో పాటు పరిచయమున్న శ్రీధర్ (హైకోర్టు న్యాయవాది) సాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట కుచ్చుటోపి పెట్టిన రామకృష్ణ పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. మహాలక్ష్మి పేరిట తీసుకున్న మొబైల్ నెంబర్ వాడాడు. అంతేకాదు నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి నిరుద్యోగులకు అనుమానం రాకుండా చూసుకున్నాడు. కొందరు డబ్బులిచ్చి చాలారోజులు అవుతోందంటూ వత్తిడి చేస్తే.. తెలివిగా వ్యవహరించేవాడు. గూగుల్ కాల్స్ చేస్తూ నిరుద్యోగులను బురిడీ కొట్టించేవాడు. ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి తో పాటు హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ రాధిక రెడ్డి గొంతులు అనుకరించి మిమిక్రీ చేస్తూ త్వరలోనే ఉద్యోగాలు వస్తాయంటూ నమ్మించేవాడు. కొందరికైతే ఏకంగా నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశాడు. అయితే దిల్సుఖ్ నగర్ కు చెందిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. రామకృష్ణ, మహాలక్ష్మిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 70వేల రూపాయల నగదు, ఓ కారుతో పాటు కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరించినట్లుగా చెబుతున్న లక్ష్మణ్, శ్రీధర్ కోసం గాలిస్తున్నారు.