వలసలు షురూ..! ఎదురులేని శక్తిగా ఎదగనున్న టీఆర్ఎస్..!!
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చంద్రశేఖర్ రావు స్పంష్టంగా చెప్పక పోయినప్పటికి వెళ్లిన ఉద్దేశాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించి కేసీఆర్ ను ఆశీర్వదించారు. ఇక సంకుల సమరాన్ని తలపించిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనూహ్య మెజారిటీ సాదించింది. ఇక తెలంగాణలో స్వతంత్య్రంగా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు అదికార గులాబీ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. దీంతో తెలంగాణలో ఎదురులేని శక్తిగా గులాబీ పార్టీ అవతరించబోతున్నట్టు చర్చ జరుగుతోంది.
ఆట మొదలైంది..! గులాబీ పార్టీ లో చేరేందుకు రెడీ అంటున్న నేతలు..!!
2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గానూ 63 స్థానాల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీని తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మిగతా పార్టీలను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ‘ఆపరేషన్ ఆకర్ష్'ను ప్రయోగించారు. ఈ ప్రభావంతో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పుడు పార్టీలో చేరిన వారితో పాటు, తన సొంత ఎమ్మెల్యేలతో కూడిన జట్టుతో తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయ దుందుబీ మోగించింది.
టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ..! ఐనా వలపలు షురూ..!!
శుక్రవారం వెలువడిన ఫలితాల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. గులాబీ పార్టీ దెబ్బకు ప్రధాన పార్టీలతో ఏర్పాటైన ప్రజాకూటమి 21 స్థానాలకే పరిమితమవగా, ఎంఐఎం ఏడు, బీజేపీ ఒకటి, స్వతంత్రులు రెండు స్థానాల్లోనే గెలిచారు. గతంలో మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉండడం.. రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారు చంద్రశేఖర్ రావు. మరి ఈ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలవడం వల్ల వలసల అవసరం లేకుండా పోయింది. అయినప్పటికి కారు పార్టీలో చేరేందుకు ఓ ఎమ్మెల్యే సిద్ధమైపోయారు. రేపోమాపో గులాబీ గూటికి చేరేందుకు సన్నహాలు చేస్తున్నారు.
బలమైన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్..! గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకున్న గులాబీ పార్టీ..!!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన కోరుకంటి చందర్. రామగుండంలో స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన చందర్ 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా చందర్కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ ఠాకూర్కు 26,614 ఓట్లు, ఎఫ్ఎఫ్బీ అభ్యర్థి మారం వెంకటేశ్కు 3,485 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్తో మంతనాలు జరిపిన చందర్.. టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారట. బుధవారం ఈ ఇద్దరూ సీఎం కేసీఆర్ను కలవనున్నారు.
రామగుండం స్వతంత్య్ర అభ్యర్థి చందర్ టీఆర్ఎస్ లోకి..! కేటీఆర్ తో మంతనాలు..!
ఇప్పటికే బుదవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ను చందర్ కలిశారు. టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చందర్ ఈ సందర్భంగా మంత్రికి తెలియజేశారు. వాస్తవానికి ఎన్నికల ముందు వరకు టీఆర్ఎస్లోనే కొనసాగిన చందర్, రామగుండం నుంచి టికెట్ ఆశించారు. అయితే, అధిష్ఠానం సోమారపు సత్యనారాయణకు కేటాయించడంతో ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఈయన చేరిక తెలంగాణలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఎదులేని శక్తిగా అవతరించడం ఖాయమనే చర్చ జరుగుతోంది.