అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు...కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఏమిటి..?
Recommended Video
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మజ్లిస్ అధినేత సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్కు పరోక్ష మద్దతు ఇస్తున్న మజ్లిస్ నేత కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించకుండా ఉండేందుకు తనకు నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి రూ.25 లక్షలు ఆఫర్ చేశారని అసదుద్దీన్ చెప్పారు. తన దగ్గర ఆడియో టేపులు ఉన్నట్లు అసదుద్దీన్ చెప్పారు.
మెదక్ జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ టీడీపీ కూటమి ఈస్ట్ ఇండియా కంపెనీని తలపిస్తోందన్నారు. ఈ కూటమి మహా కూటమి కాదన్న అసదుద్దీన్... ఇది 2018 ఈస్ట్ ఇండియా కంపెనీ అని విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక ఇక్కడి నిర్ణయాలు ఎవరు చేయాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పారు. విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడా... పుణే నుంచి ఆర్ఎస్ఎస్.. లేక ఢిల్లీ నుంచి కాంగ్రెస్సా అని సూటిగా ప్రశ్నించారు అసదుద్దీన్.
బహిరంగ సభలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీలకు ఓటు వేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు టీఆర్ఎస్కే ముస్లింలు ఓటు వేయాలని అన్నారు. ఇదిలా ఉంటే మజ్లిస్ పార్టీ ఏడు స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగతా ప్రాంతాల్లో అంటే ఎక్కడైతే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో ఉన్నారో అక్కడ టీఆర్ఎస్ తరపున ప్రచారం నిర్వహించనుంది.
ఇదిలా ఉంటే నిర్మల్ అభ్యర్థి మహేశ్వరరెడ్డి దీనిపై స్పందించారు. అసదుద్దీన్ చేస్తున్న ఆరోపణలు సత్యదూరమైనవని చెప్పారు. తనపై అసదుద్దీన్ చేసిన ఆరోపణలను ఖండించారు మహేశ్వరరెడ్డి.
అసదుద్దీన్కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. తాను రూ.25 లక్షలు అసదుద్దీన్కు ఆఫర్ చేశామని చెప్పడం పచ్చి అబద్దమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మహేశ్వరరెడ్డి చెప్పారు. మైనార్టీల ఓట్ల కోసం అసదుద్దీన్ను ఇంద్రకరణ్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తనకు అసదుద్దీన్తో పరిచయం లేదని చెప్పిన మహేశ్వర్ రెడ్డి అసదుద్దీన్ది రూ.25 లక్షల స్థాయి అని తాను భావించడంలేదని చెప్పారు.