మాకు ఇష్టం ఉన్నవారికే దళితబంధు ఇస్తాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు!!
ఇటీవల కాలంలో టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కారణంగా మారుతున్నాయి. ప్రజల నుంచి ఎక్కడైనా వ్యతిరేకత వ్యక్తమైతే టిఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం అదే తరహాలో దళిత బంధును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు ఇవ్వాలని అడిగిన వారిపై మంత్రి అల్లోల అసహనం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో పర్యటించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న క్రమంలో, అక్కడ సభకు హాజరైన కొంతమంది మహిళలు తమకు దళిత బంధు పథకం ఇవ్వాలని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారిపై అసహనం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం అందరికీ వస్తుంది, కాస్త ఓపిక పట్టాలని సూచించారు. దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. 10 లక్షలతో ఏం చేసి బతుకుతారు? మీకు ఏం అనుభవం ఉందో చెబితేనే దళిత బంధు ఇస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇస్తాం : మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు
ఇక ఇదే సమయంలో దళిత బంధు కోసం దాదాపుగా కోటి యాభై లక్షల రూపాయలు మంజూరు చేశామని గుర్తు చేసిన ఆయన కొంతమందికి దళిత బంధు వచ్చిందని, మీకు ఓపిక లేకుంటే మేం ఏమి చేస్తాం అంటూ ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళు వాళ్ళనే అడిగి దళిత బంధు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి అని మండిపడిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దళిత బంధు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్నించిన వారిని బయటకు పంపాలని పోలీసులకు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హుకుం
ఇక సభలో ప్రశ్నించిన వారిని బయటకు తీసుకు వెళ్లాలని మంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. మరో మహిళ కూడా దళిత బంధు గురించి అడగడంతో ఆమెను మాట్లాడకుండా దబాయించి కూర్చోబెట్టారు. ఇక మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రశ్నించిన వారిని బయటకు పంపించడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం చేస్తున్నారని, వారికి దగ్గరగా ఉన్న వారికే దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా తాజాగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దళిత బంధు అమలు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పరిస్థితి ఇలాగే ఉంది.
దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల తమకు కళ్యాణ లక్ష్మి పథకం రాలేదన్న ఒక యువకుడిపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు రాలేదు.. అందరికీ వస్తుంది కదా.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ మండిపడిన ఎమ్మెల్యే ఆ యువకుడిని లోపల వెయ్యాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, మరో ఘటనలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సమావేశం లో పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి రామ్ సాగర్ సర్పంచ్ తాడూరు రవీందర్ తమ గ్రామస్తులకు దళిత బంధు పథకం అందలేదని, అర్హులకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ సోయి ఉన్నవాళ్లు గ్రామంలో ఉండే వాళ్ల పేర్లు పంపించాలని సూచించారు. కెసిఆర్ కు ఓట్లు వేస్తామన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు .