అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశారు...ఈ ఎన్నికల్లో తప్పు దిద్దుకోండి అంటున్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ సమావేశాల్లో సభలలో మాట్లాడుతున్న ఎర్రబెల్లి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును లోక్ సభ ఎన్నికల్లో దిద్దుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రమంతా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఒక ఖమ్మం ప్రజలు మాత్రం టిఆర్ఎస్ పార్టీని ఓడించారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఏం లాభం లేదని, గెలిచిన వారంతా టిఆర్ఎస్ పార్టీ లోనే చేరాలని ఆయన గుర్తు చేశారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో తప్పు చేశారని, ఇక ఈ ఎన్నికల్లో ఆ తప్పును దిద్దుకోవాలని టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ములుగు నుండి వెళ్లగొట్టిన పొదెం వీరయ్య గెలిపిస్తే ఏం లాభం చేకూరిందో చెప్పాలంటూ ప్రశ్నించిన ఎర్రబెల్లి ఈసారి గులాబీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇక పంచాయితీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్రంలోని గ్రామాలన్నిటికీ మంత్రినని, పింఛన్లు, రుణాలు ఇచ్చేది తానేనని చెప్పుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి 70 శాతం ఓట్లు వచ్చిన మండలాలను, 80 శాతం ఓట్లు వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘించడమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నాయి.












Click it and Unblock the Notifications