బిజీ షెడ్యూల్ లోనూ మంత్రి ఎర్రబెల్లి ఆటవిడుపు; సరదాగా చేపలవేట.. కొసమెరుపు ఏమిటంటే!!
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటు మంత్రిగా వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉంటూనే, మరోపక్క జనంతో మమేకం అయ్యేలా అనేక పనులు చేస్తుంటారు. గతంలో అనేక మార్లు కార్యక్రమాలలో భాగంగా వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఆగి వ్యవసాయ పనులు చేసుకునే మహిళలతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేసిన మంత్రి ఎర్రబెల్లి, గిరిజన లంబాడి మహిళలతో కలిసి డాన్సులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా బిజీ షెడ్యూల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి ఆటవిడుపుగా పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని వరంగల్ వెళుతున్న క్రమంలో దారిలో వాగులో గాలమేసి చేపల వేట సాగించారు. ఈ సరదా సన్నివేశానికి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
గాలం తీసుకుని చేపల వేటకు వెళ్ళిన మంత్రి ఎర్రబెల్లి
ఇంతకీ ఏం జరిగిందంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని, పలువురిని కలుస్తూ, పరామర్శిస్తూ, వరంగల్ కు వెళుతున్న క్రమంలో, దారిలో నెల్లికుదురు మండలం మేచ రాజు పల్లె దాటి ఎర్రబెల్లి గూడెం మీదుగా వెళుతుండగా, దారిలో కొందరు చేపలు పడుతూ కనిపించారు. వెంటనే తన కాన్వాయ్ ను ఆపిన మంత్రి ఎర్రబెల్లి వాహనం దిగి, చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వారిలో ఒకరి నుంచి గాలం కర్ర తీసుకున్నారు. ఆ కర్రను పట్టి చేపల కోసం వేట మొదలు పెట్టారు.
చేపలు పట్టే వాళ్ళతో మాట్లాడి, చేపల ఉత్పత్తి తెలంగాణాలో ఎలా ఉందో చెప్పిన ఎర్రబెల్లి
ఈ క్రమంలో అక్కడ చేపలు పడుతున్న వాళ్లతో సరదాగా మాట్లాడారు. తన పరిచయం, తన సొంత గ్రామం తెలుసా? అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణలో నిత్య కృత్యం గా కనిపించిన చేపల వేట, ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు తగ్గిపోయిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక, కెసిఆర్ సీఎం అయ్యాక, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాక, చెరువులలో నీరు సమృద్ధిగా చేరాయని చెప్పారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల కొలది చేపలను ఉచితంగా చెరువుల్లో వేస్తూ, చేపల విప్లవాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా చేపలే కనిపిస్తున్నాయని, తద్వారా చేపలు పట్టే వాళ్ళ కు ఉపాధి, ఆదాయం పెరిగి, వాళ్ళ కుటుంబాలు ఉన్నతంగా బతుకుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
జనంతో మమేకం అయ్యేలా మంత్రి ఎర్రబెల్లి సరదా పనులు
ఇది సీఎం కెసిఆర్ సాధించిన గొప్ప విజయమని చెప్పారు. సబ్బండ కులాలకు, ఆయా కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చారని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా తమ వద్దకు వచ్చి కాసేపు సరదాగా వాళ్ళతో కలిసి చేపలు పట్టడంతో అక్కడ చేపలు పడుతున్న యువత అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఇట్టే కలిసిపోయే ఎర్రబెల్లి రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మంత్రిగా అనేక కార్యక్రమాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆటవిడుపుగా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అయితే ఈ సరదా సందర్భంలో ఎర్రబెల్లి గాలానికి ఒక్క చేప కూడా చిక్కక పోవడం కొసమెరుపు.