మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్: ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులకు అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
కాగా, శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తేలింది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు.
తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలెవ్వరూ తన వద్దకు రావద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. తన నియోజకవర్గ ప్రజలకు అధికారులు, పీఏలు అందుబాటులో ఉంటారని సూచించారు. కాగా, ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి వైద్యులను సంప్రదించి వైద్యం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 3 ఒమిక్రాన్ కేసలు
తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 3 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది.
గత 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 333 మంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వారందరికీ కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా.. ఎనిమిది మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు.
ఇప్పటి వరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 11,245 మంది ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్టీసీఆర్ పరీక్షలు చేశారు. వీరిలో 83 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వీన్సింగ్ కి పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చింది. మిగిలిన 61 మందికి పాజిటివ్ గా తేలింది. చికిత్స అనంతరం బాధితుల్లో 10 మంది కోలుకున్నారు. మరో 20 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కూడా స్వల్పంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో 26,947 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 140 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,553కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ శనివారం సాయంత్రం బులిటెన్ విడుల చేసింది. శుక్రవారం ఇద్దరు కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4021కి పెరిగింది. గత 24గంటల్లో 186 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3499 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.