కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలు భోగిమంటల్లో; కేసీఆర్ హయాంలోనే రైతులకు నిజమైన సంక్రాంతి: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుబంధు తెలంగాణలోని ప్రతి ఇంటా సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయని, తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశారని, రైతును రాజును చేశారని, కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను భోగి మంటల్లో కాల్చేద్దాం అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ అందిస్తున్న రైతు పథకాలతో నిజమైన సంక్రాంతి
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయతక్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజామోద, ప్రజోపయోగ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. రైతు అనుకూల, రైతులకు మేలు చేసే రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాల ద్వారా నిజమైన సంక్రాంతి వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

వ్యవసాయం దండుగ నుండి పండుగ చేసిన కేసీఆర్
తెలంగాణ వచ్చే నాటికి వ్యవసాయం దండుగ అన్న భావన ఉందని, రైతంటే, పిల్లను ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి నుండి పంటల పెట్టుబడిగా రైతు బంధుని ప్రతి ఏటా ఎకరాకు 10వేల చొప్పున ఇస్తూ, సాగునీరు, 24 గంటలపాటు కోతలు లేని, నాణ్యమైన ఉచిత విద్యుత్ని అందించి ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రైతుల రుణాలను మాఫీ చేస్తూ, రైతులకు ప్రభుత్వమే బీమా చేస్తూ, చివరకు పంటలను కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం, సీఎం దేశంలోనే కాదు చరిత్రలో లేరన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రైతులకు పిల్లనివ్వని పరిస్థితి నుండి రైతులను గొప్పగా చూసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందని తెలిపారు.

సిఎం కెసిఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి
65లక్షల మంది రైతులకు 50వేల కోట్ల రైతు బంధు, 70వేల మంది రైతు కుటుంబాలకు 3,500 కోట్ల బీమా క్లెయిమ్ లు, రైతాంగానికి ఉచిత విద్యుత్ కింద ఏటా 10వేల కోట్లు, పంటల కొనుగోలు కోసం 30వేల కోట్లు వెచ్చిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సాగు విస్తీర్ణాన్ని 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెంచి, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై 2లక్షల 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. రైతాంగం కోసం కృషి చేస్తున్నఏకైక సీఎం కేసిఆర్ అని ఎర్రబెల్లి దయాకర్ రావు కితాబిచ్చారు. సిఎం కెసిఆర్ హయాంలోనే రైతాంగానికి అసలైన సంక్రాంతి పండుగ వచ్చిందని తెలిపారు.

కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు భోగి మంటల్లో కాల్చెయ్యండని పిలుపు
ఇక ఇదే సమయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ పై విరుచుకుపడ్డ ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను భోగి మంటల్లో దహనం చేయాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కరోనా వైరస్ లను, వాటి ద్వారా కలుగుతున్న కష్టాలను భోగి మంటలలో అగ్ని దేవుడికి ఆహుతి చేయాలన్నారు. రాబోయే కాలంలో ప్రజలు శాంతి సౌఖ్యాలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications